టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను సారథిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందుకు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదని, అతడికి బదులుగా సంజూ శాంసన్ పేరును సూచించాడని వార్తలు వచ్చాయి.
అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. లాంగ్ టర్మ్ కెప్టెన్గా శాంసన్ను ఇప్పుడే నమ్మడం తొందరపాటు అవుతుందని గంభీర్కు అగార్కర్ తెలియజేసినట్లు సమాచారం. దీంతో తన మనసు మార్చుకున్న గంభీర్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
మరోవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ మాత్రమే కాదు వైస్ కెప్టెన్ కూడా మారబోతున్నాడు. ఇప్పటివరకు డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మను కొత్త వైస్ కెప్టెన్గా నియమించబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. గురువారం జరగనున్నబీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ఈ నెలఖారులో ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా కొత్త కెప్టెన్తో వెళ్లనుంది. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. సూర్య టీ20 ప్రపంచకప్ను అందించినప్పటికి, అతడి పేలవ ఫామ్ కారణంగానే వేటు వేసేందుకు బోర్డు సిద్దమైంది.
శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే.. చివరగా 2023లో భారత తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడు కేవలం వన్డేలకు మాత్రం పరిమితమయ్యాడు. దీంతో అయ్యర్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడం కష్టమని అంతా భావించారు.
కానీ ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. శ్రేయస్కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది.
చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్


