ఐపీఎల్-2026 విజేతగా రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. రన్నరప్గా గుజరాత్ టైటాన్స్ నిలవగా, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2, ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్లో ఓడిపోయాయి.
అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఎవరూ ఊహించని విధంగా ముగిసింది. మొదటి ఏడు మ్యాచ్లలో ఒక్క ఓటమి కూడా చూడని పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లలో దారుణ ఓటమిపాలై కనీసం ప్లే ఆఫ్స్కు చేరకుండా నిష్క్రమించింది. తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచినా పంజాబ్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంతో సరిపెట్టుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ పతనానికి గల కారణాలను తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషించారు.
పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది సీజన్కు మంచి ఊపు తీసుకొచ్చింది. వారి క్రికెట్ చాలా చాలా పాజిటివ్గా, సాహసోపేతంగా, కొన్ని సార్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేలా కొనసాగింది. ఇలాంటి సుదీర్ఘమైన టోర్నీల్లో 'మొమెంటం' కీలక పాత్ర పోషిస్తుంది. ఇంత వేగంగా సాగిపోయే టోర్నమెంట్లో ఆయా జట్లు కేవలం తమ 'ఆట విధానం' పైనే దృష్టి పెట్టాలి.
అంతే తప్ప ఫలితాలు గురుంచి ఎక్కువగా ఆలోచించకూడదు. పంజాబ్ ఇప్పుడు అదే తప్పు చేసింది. ఫస్ట్ హాఫ్లో పంజాబ్ ఫలితాలను పట్టించుకోకుండా కేవలం తమ ఆటపై మాత్రమే ఫోకస్ చేసింది. అందుకే అద్భుతంగా రాణించింది. కానీ సెకెండ్ హాఫ్నకు వచ్చేసారికి పరిస్థితి తారుమారు అయిపోయింది. ఒత్తిడి పెరగడంతో పంజాబ్ జట్టు ఆట విధానాన్ని పక్కనబెట్టి.. కేవలం ఫలితాలపై దృష్టి పెట్టింది. అందుకే టోర్నీలో ముందుకు సాగలేకపోయింది సచిన్ 'రెడ్డిట్' పోస్ట్లో రాసుకొచ్చారు.
చదవండి: సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు!


