Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..!
Published
Mon, Jan 31 2022 5:09 PM
Shoaib Akhtar Highlights X Factor Lacked By Indian Pacers: టీమిండియా పేసర్లను ఉద్ధేశించి పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ బ్రెట్ లీతో మాట్లాడుతూ భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో భారత పేస్ దళం బాగా పుంజుకున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో పాక్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని అన్నాడు.
భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారని, ఇదే వారికి పాక్ పేసర్లకు తేడా అని పేలాడు. పాక్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్ల ముఖాల్లో కనిపించవని, ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉందని, అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు.
పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరని.. వికెట్ తీయడమే వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ యాటిట్యూడే వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని వివరించాడు. దీనికి తోడు మేము ఎక్కువగా మాంసాహారం తింటామని, అందుకే దృడంగా ఉంటామని, ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతామని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని ఈ సందర్భంగా ఉదహరించాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా పేస్ యూనిట్కు మించిన ఫాస్ట్ బౌలింగ్ దళం ఏ జట్టుకు లేదనడం అతిశయోక్తి కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం కలకలలాడుతోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల పేసర్ల కంటే భారత పేస్ దళం దృడంగా కనిపిస్తుంది. చదవండి: ధోని నా భార్య కాదు.. బీసీసీఐలో నాకు గాడ్ ఫాదర్లు ఎవ్వరూ లేరు..!