టీమిండియాకు కాదు.. ఐపీఎల్‌ కోచ్‌గా ఉండటం బెటర్‌: సెహ్వాగ్‌ | Sehwag Prefers IPL Coaching Over Leading Team India Reveals Reason | Sakshi
Sakshi News home page

నా కుమారులూ క్రికెటర్లే.. టీమిండియా కోచ్‌గా వెళ్తే..: సెహ్వాగ్‌

Sep 3 2024 5:06 PM | Updated on Sep 3 2024 5:28 PM

Sehwag Prefers IPL Coaching Over Leading Team India Reveals Reason

టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి గురించి మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టు శిక్షకుడిగా ఉండటం కంటే.. ఐపీఎల్‌ కోచ్‌గా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. భారత విధ్వంసకర ఓపెనర్‌గా గుర్తింపు పొందిన వీరూ భాయ్‌.. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అదే ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు చివరిసారిగా ప్రాతినిథ్యం వహించాడు.

అనంతరం అదే జట్టుకు 2016లో మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పంజాబ్‌ ఫ్రాంఛైజీ క్రికెట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు సెహ్వాగ్‌. 2018 వరకు అదే పదవిలో కొనసాగాడు. అయితే, 2017లోనే టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో నిలిచినా.. రవిశాస్త్రికి అవకాశం దక్కగా.. సెహ్వాగ్‌కు మొండిచేయి ఎదురైంది. అప్పటి నుంచి మళ్లీ అతడు ఎన్నడూ జాతీయ జట్టు కోచ్‌గా వెళ్లాలన్న ప్రయత్నం చేయలేదు.

టీమిండియాకు కాదు.. ఐపీఎల్‌ కోచ్‌గా ఉండటం బెటర్‌
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్‌ అందుకు గల కారణం వెల్లడించాడు. ‘‘టీమిండియా కోచ్‌గా ఉండటం కంటే ఐపీఎల్‌ జట్టు కోచ్‌గా ఉండటానికే నేను మొగ్గుచూపుతాను. నిజానికి నేను గనుక భారత జట్టు కోచ్‌ని అయితే.. మళ్లీ పాతరోజుల్లాగే గడుస్తుంది. సిరీస్‌లు ఉన్నపుడు ఇంటికి ఏడెనిమిది నెలలపాటు దూరంగా ఉండాల్సి వస్తుంది.

నా కుమారులూ క్రికెటర్లే
ఇప్పుడు నా పిల్లల వయసు 14, 16 ఏళ్లు. వాళ్లకు నా అవసరం ఉంది. వాళ్లిద్దరు క్రికెటర్లే. ఒకరు ఆఫ్‌ స్పిన్నర్‌ అయితే.. మరొకరు ఓపెనింగ్‌ బ్యాటర్‌. నా కుమారులకు దిక్సూచిలా ఉంటూ.. వారికి తగినంత సమయం కేటాయించడమే నా ముందున్న కర్తవ్యం’’ అని సెహ్వాగ్‌ అమర్‌ ఉజాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ కోచ్‌గా మారితే స్వల్పకాలం మాత్రమే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. అందుకే తన ఓటు అటు వేశానని పేర్కొన్నాడు.

చదవండి: అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పా.. ఆ తర్వాత: భజ్జీ

Advertisement
 
Advertisement
Advertisement