Satwiksairaj Rankireddy-Chirag Shetty Enter Korea Open Final - Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో సాత్విక్‌ జోడీ 

Jul 22 2023 4:04 AM | Updated on Jul 22 2023 4:13 PM

Satvik Jodi in the semifinals - Sakshi

యోసు (కొరియా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట వరుస సెట్లలో ఐదో సీడ్‌ టకురో హొకి–యుగొ కొబయషి (జపాన్‌) ద్వయంపై అలవోక విజయం సాధించింది.

40 నిమిషాల్లో ముగిసిన ఈ క్వార్టర్స్‌ పోరులో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–14, 21–17తో జపాన్‌ ద్వయంపై గెలుపొందింది. గత నెల ఇండోనేసియా ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గి జోరు మీదున్న భారత షట్లరు ఈ టోరీ్నలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తొలి గేమ్‌ ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం గేమ్‌ గెలిచేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.

రెండో గేమ్‌లో భారత జోడీ 3–6తో కాస్త వెనుకపడినట్లు కనిపించింది. అయితే అక్కడి నుంచి సాత్విక్‌–చిరాగ్‌లిద్దరు తమ షాట్లకు పదునుపెట్టడంతో వరుసగా 6 పాయింట్లు గెలిచారు. అక్కడి నుంచి ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. 

ఇటీవలే ‘యోనెక్స్‌’ ఫ్యాక్టరీలో ల్యాబ్‌లో ఫాస్టెస్ట్‌ స్మాష్‌తో గిన్నిస్‌ రికార్డు నమోదు చేసిన సాత్విక్‌ సాయిరాజ్‌ కోర్టులోనూ ఈ సారి అలాంటి ఫీట్‌ను మళ్లీ సాధించడం విశేషం. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సాత్విక్‌ రికార్డు వేగంతో స్మాష్‌ బాదాడు. అతను కొట్టిన స్మాష్‌కు షటిల్‌ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement