
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో కరుణ్ నాయర్కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయితే ప్రధాన జట్టు నుంచి సర్ఫరాజ్ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఈ ముంబై ఆటగాడిని ఇండియా-ఎ జట్టులో భాగం చేసింది.
ఈ క్రమంలో ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన రెండు అనాధికారిక టెస్టు సిరీస్లో సర్ఫరాజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అంతేకాకుండా టీమిండియాతో జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో కూడా సెంచరీతో చెలరేగి తన సత్తాచాటుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఏమి తప్పుచేశాడని జట్టు నుంచి తప్పించారని చోప్రా మండిపడ్డాడు.
"సర్ఫరాజ్ ఖాన్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు అతడు ఎటువంటి తప్పిదం చేయలేదు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నాడు. బహుశా అతడి బ్యాటింగ్ స్టైల్, టెక్నిక్పై నమ్మకం లేకపోవడంతో మీరు ఎంపిక చేసుండకపోవచ్చు. అటువంటి అప్పుడు ఇండియా-ఎ టీమ్కు ఎలా ఎంపిక చేశారు.
ఇంగ్లండ్లో అతడు పరుగులు సాధించగలడనే ఉద్దేశ్యంతో ఏ టీమ్కు ఎంపిక చేసింటే, అటువంటి అప్పడు అతడికి ప్రధాన జట్టులో కూడా అవకాశమివ్వాలి. బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో సర్ఫరాజ్ అద్బుతమైన సెంచరీ సాధించాడు.
ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. కానీ ఆ రెండు మ్యాచ్లో మిగితా ఆటగాళ్లు కూడా పరుగులు సాధించలేదు. ఆస్ట్రేలియా టూర్కు వెళ్లినప్పుడు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.
ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు
శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్