
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో తొలి రెండు మ్యాచ్ల్లో (సన్రైజర్స్, కేకేఆర్) ఓడి, ఆతర్వాతి మ్యాచ్లో గెలిచిన (సీఎస్కే) రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 5న ఛండీఘడ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు ఆ జట్టుకు శుభవార్త అందింది. పూర్తి ఫిట్నెస్ లేని కారణంగా తొలి మూడు మ్యాచ్ల్లో వికెట్కీపింగ్కు, కెప్టెన్సీకి దూరంగా ఉన్న సంజూ శాంసన్ పంజాబ్ మ్యాచ్తో వికెట్కీపింగ్ మరియు కెప్టెన్సీ బాధ్యతలను తిరిగి చేపట్టనున్నాడు.
ఈ మేరకు శాంసన్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. చేతి వేలు ఫ్రాక్చర్ కారణంగా శాంసన్ తొలి మూడు మ్యాచ్ల్లో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కావడంతో శాంసన్ కెప్టెన్సీని కూడా వదులుకుని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు.
తొలి మూడు మ్యాచ్ల్లో కెప్టెన్సీ, వికెట్కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉన్న శాంసన్ బ్యాటింగ్లో పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్లో 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఆతర్వాత కేకేఆర్పై 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. చివరిగా సీఎస్కేతో ఆడిన మ్యాచ్లో 16 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేశాడు.
కాగా, కెప్టెన్గా రియాన్ పరాగ్ అనుభవారాహిత్యం రాయల్స్ ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. కీలకమైన సమయాల్లో పరాగ్ మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. సీఎస్కేతో మ్యాచ్లో రాయల్స్ గెలిచింది కానీ, ఆ మ్యాచ్లో ఓడుంటే మాత్రం పరాగ్పై అందరూ దుమ్మెత్తిపోశేవారు. ఆ మ్యాచ్లో పరాగ్ మంచి టచ్లో ఉన్న జోఫ్రా ఆర్చర్ను కాదని చివరి ఓవర్ను సందీప్ శర్మకు ఇచ్చాడు (బౌలింగ్).
ఆ ఓవర్లో సీఎస్కే 20 పరుగులు చేయాల్సి ఉండగా.. సందీప్ శర్మ ఎలాగోలా మేనేజ్ చేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒకవేళ పరాగ్ నిర్ణయం (సందీప్కు బౌలింగ్ ఇవ్వడం) మిస్ ఫైర్ అయ్యుంటే రాయల్స్ వరుసగా మూడో పరాజయం ఖాతాలో వేసుకోవాల్సి వచ్చేది.
పరాగ్ ఎపిసోడ్ను అటుంచితే.. శాంసన్ రాకతో రాయల్స్ ఫేట్ మారుతుందేమో చూడాలి. ప్రస్తుతం రాయల్స్ పేలవమైన రన్రేట్ కలిగి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సన్రైజర్స్ మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసినా.. కేకేఆర్ మ్యాచ్లో బ్యాటింగ్లో తడబడింది. సీఎస్కేపై గెలిచినప్పటికీ రాయల్స్ రన్రేట్ మెరుగుపడలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఒక్కటే రాయల్స్ కంటే కింద ఉంది (చివరి స్థానం).
పంజాబ్-రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ రాయల్స్కు అంత ఈజీగా ఉండదు. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో బంపర్ విక్టరీలు సాధించి మాంచి జోష్ మీద ఉంది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. తొలి మ్యాచ్లో శశాంక్ సింగ్.. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ సింగ్, నేహల్ వధేరా మంచి టచ్లో కనిపించారు.
ఇంకా ఆ జట్టు విధ్వంసకర వీరులు మ్యాక్స్వెల్, స్టోయినిస్ టచ్లోకి రాలేదు. వారిద్దరూ ఫామ్లోకి వస్తే ఏ జట్టు పంజాబ్ ముందు నిలువలేదు. పంజాబ్ బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా ఉంది. లక్నో మ్యాచ్లో అర్షదీప్, జన్సెన్, చహల్ రాణించారు. ఫెర్గూసన్ కూడా పర్వాలేదనిపించాడు. ఇంత పటిష్టమైన పంజాబ్ను రాయల్స్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.