చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్‌గా సాకేత్‌ జోడీ | Saket Jodi becomes runner up in Chennai ATP tournament | Sakshi
Sakshi News home page

చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్‌గా సాకేత్‌ జోడీ

Feb 9 2025 2:46 AM | Updated on Feb 9 2025 2:46 AM

Saket Jodi becomes runner up in Chennai ATP tournament

చెన్నై: ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్, భారత డేవిస్‌ కప్‌ జట్టు మాజీ సభ్యుడు సాకేత్‌ మైనేని ఈ సీజన్‌లో చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నీలో  డబుల్స్‌ టైటిల్‌ నిలబెట్టుకోలేకపోయాడు. భారత సహచరుడు రామ్‌కుమార్‌ రామనాథన్‌తో కలిసి బరిలోకి దిగిన సాకేత్‌  చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.  శనివారం జరిగిన తుదిపోరులో సాకేత్‌ – రామ్‌కుమార్‌ జోడి  4–6, 4–6తో షింటారో మొచిజుకి–కైటో వుసుగి (జపాన్‌) జంట చేతిలో పరాజయం చవిచూసింది. 

జపాన్‌ జోడీ మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లపై పైచేయి సాధించింది. దీంతో తొలి సెట్‌ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత రెండో సెట్‌లోనూ భారత జంట పుంజుకోలేకపోయింది. ఇదే అదనుగా షింటారో–కైటోలు చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకుంది. 

గతేడాది ఇక్కడ భారత ద్వయం టైటిల్‌ సాధించింది. ఈ సారీ టైటిల్‌ వేటలో నిలిచినా... చివరి మెట్టుపై చతికిలబడింది. సాకేత్‌–రామ్‌ కుమార్‌ జోడీ తదుపరి ఈ నెల 17 నుంచి పుణేలో జరిగే ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌ బరిలోకి దిగుతుంది.    

Advertisement
 
Advertisement
Advertisement