
భారత్ ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ఆరంభానికి మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.
ఇక ఇది ఇలా ఉండగా.కాగా భారత టెస్టు క్రికెట్లో నాలుగో నంబర్ బ్యాటింగ్ స్దానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1970ల నుండి 1980ల వరకు దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేయగా.. ఆ తర్వాత గవాస్కర్ వారసుడిగా సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైగా నాలుగో నంబర్లో కొనసాగాడు.
అనంతరం సచిన్ నుంచి 2013లో విరాట్ కోహ్లి ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కీలకమైన నాలుగో స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్ను పేరును చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్ధానంలో సాయిసుదర్శన్ సరైనోడని పనేసర్ అభిప్రాయపడ్డాడు.
"ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అందులో ఒకరు సర్రే ఆటగాడు సాయిసుదర్శన్. అతడు చాలా దూకుడుగా, ఎటువంటి భయం లేకుండా ఆడుతాడు. అతడికి ఇంగ్లండ్ కండీషన్స్లో ఆడిన అనుభవం ఉంది. సర్రే క్రికెట్ క్లబ్ తరపున అద్బుతంగా రాణించాడు.
అతడు భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడు. కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని సుదర్శన్ సమర్ధవంతంగా భర్తీ చేస్తాడని నేను భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి రెడ్ బాల్ క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. యువ భారత జట్టు కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా" అని ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు.