
ఇచ్చిన ప్రోత్సాహకాల్ని తిరిగి రాబడతాం
భారత టెన్నిస్ ఆటగాళ్లకు ‘సాయ్’ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాళ్లు దేశం తరఫున ఆడకపోతే ప్రోత్సాహకాల్ని తిరిగి రాబడతామని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) స్పష్టం చేసింది. కొంతకాలంగా పేరొందిన ఆటగాళ్లు దేశాన్ని విస్మరించి ఏటీపీ టోర్నీలకే ప్రాధాన్యమివ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాయ్’... ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పథకాలు, ప్రోత్సాహకాల రూపేణా ఆర్థిక సాయం పొందిన ఆటగాళ్లు సహేతుక కారణాలు లేకుండా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నిరాకరిస్తే ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది.
టార్గెట్ ఒలింపిక్ పొడియం పథకం (టాప్స్) ఎప్పటి నుంచో అమలవుతున్నప్పటికీ... ప్రత్యేకంగా ఆసియా క్రీడల్లో పతకాలే లక్ష్యంగా టార్గెట్ ఆసియా క్రీడల గ్రూప్ (టీఏజీజీ) పథకాన్ని కొత్తగా ఈ ఏడాదే తీసుకొచ్చింది. దీనికింద పలువురు ప్లేయర్లకు విదేశీ కోచ్లతో శిక్షణ, విదేశీ పర్యటనల కోసం భారత్ నిధులు మంజూరు చేస్తోంది. ఇలా పథకాలతో ఆర్థికసాయం, ప్రోత్సాహకాలు పొందిన ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. భారత మేటి సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ డేవిస్ కప్ ఆడేందుకు అదేపనిగా ససేమిరా అంటున్నాడు.
గతేడాది పాకిస్తాన్, స్వీడన్... ఈ ఏడాది టోగోతో డేవిస్ కప్ మ్యాచ్లు ఆడకుండా తప్పించుకున్నాడు. ఇలాగే శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీలు కూడా డేవిస్ కప్ పోటీలపై అనాసక్తి కనబరుస్తున్నారు. కానీ ఏటీపీ, గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంకుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, సాకేత్ మైనేని, రిత్విక్ బొల్లిపల్లి, మహిళా ప్లేయర్లు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి, వైదేహి చౌధరీ, రుతుజా, మాయా రాజేశ్వరన్లకు టీఏజీజీ కింద ఆర్థిక అండదండలు లభిస్తున్నాయి. ‘సాయ్’ తాజా నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సహా డేవిస్ కప్ కెపె్టన్ రోహిత్ రాజ్పాల్, బిల్లీ జీన్ కింగ్ కప్ కెప్టెన్ విశాల్ ఉప్పల్ స్వాగతించారు.