భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్ పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్లో వినేశ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నియమించే స్వతంత్ర పరిశీలకుడి పర్యవేక్షణలో ఈ ట్రయల్స్ జరుగుతాయి. వీటిని వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నారు.
ఇటీవల యూపీలోని గోండాలో జరిగిన జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తనను అనుమతించకుండా డబ్ల్యూఎఫ్ఐ పలు అడ్డంకులు సృష్టించడంతో వినేశ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై జరిగిన చర్చలో భాగంగా డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారశైలిని కోర్టు తప్పు పట్టింది. డబ్ల్యూఎఫ్ఐ ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, వినేశ్లాంటి దిగ్గజ ప్లేయర్ పట్ల వివక్ష చూపించడంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయ పడింది. బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా మహిళా క్రీడాకారిణులకు సహజంగా వచ్చే విరామాన్ని పట్టించుకోకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది.


