భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ తమిళనాడు బౌలర్తో గ్లోస్టర్షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్షిప్లోని మిగిలిన ఆరు మ్యాచ్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.
గ్లోస్టర్షైర్ తరఫున సాయి కిషోర్ వోర్సెస్టర్షైర్, డర్హమ్, డెర్బీషైర్, లాంకషైర్, మిడిల్సెక్స్, కెంట్లతో జరిగే మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన గ్లోస్టర్షైర్ కేవలం ఒక విజయమే నమోదు చేసి 38 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సాయి రాకతో జట్టు స్పిన్ విభాగం బలోపేతం అవుతుందని యాజమాన్యం భావిస్తోంది.

గతేడాది సర్రే తరఫున కౌంటీ క్రికెట్ ఆడిన సాయి కిషోర్ రెండు మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డర్హమ్పై రెండో ఇన్నింగ్స్లో 72 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఆ అనుభవంతో ఇప్పుడు రెండోసారి ఇంగ్లండ్లో ఆడే అవకాశాన్ని అందుకున్నాడు.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో సాయి కిషోర్ అద్భుత రికార్డు ఉంది. 54 మ్యాచ్ల్లో 223 వికెట్లు పడగొట్టిన అతడు సగటున 24.21 పరుగులకు ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ఘనత నమోదు చేశాడు. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్లోనూ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు.
అయితే ఐపీఎల్ 2026లో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి కిషోర్కు పెద్దగా అవకాశాలు లభించలేదు. కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన అతడు ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.


