
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చారు. అయితే హిట్మ్యాన్ నిర్ణయంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, అతడి తండ్రి గురునాథ్ శర్మ సైతం నిరాశకు లోనయ్యారంట. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్నే వెల్లడించాడు.
"మా నాన్న.. నేను రెడ్ బాల్తో క్రికెట్ ఆడటం ఎక్కువగా చూశారు. అందుకే ఆయనకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన కొంచెం నిరాశచెందారు. అదే సమయంలో నా సుదీర్ఘ కెరీర్ పట్ల ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు.
ఈ రోజు ఈస్ధాయికి నేను చేరుకున్నానంటే అందులో కీలక పాత్ర మా నాన్నదే. తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా మనం ఏదీ సాధించలేము. నాకు కూడా టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా కెరీర్ తొలి రోజు నుంచే ఆయన టెస్టు క్రికెట్కు అభిమానిగా మారారు.
నేను వన్డేలో 264 పరుగులు చేసిన రోజు నాకు ఇంకా ఇప్పటికి బాగా గుర్తుంది. ఆ రోజు మాన్న నా దగ్గరకు వచ్చి ఏదో మొక్కుబడిగా బాగా ఆడావని ప్రశంసించారు. అంతే తప్ప అతనిలో ఎటువంటి ఉత్సాహం కన్పించలేదు" అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.
రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.
చదవండి: IND vs ENG; 'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు'