
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్ను రింకూ పెళ్లిచేసుకోనున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 8న జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్లో జరగనుంది. అదేవిధంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్లో వివాహం చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18న హోటల్ తాజ్లో గ్రాండ్గా జరగనుంది. ఈ విషయాన్ని రింకూ సింగ్ సన్నిహితులు వెల్లడించారు.
కాగా వీరిద్దరి పెళ్లి అంశం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు.
కాగా 27 ఏళ్ల రింకూ భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ యూపీ క్రికెటర్ టీమిండియా తరపున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. అదేవిధంగా 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రియా సరోజ్ ఎంపీ మాత్రమే కాకుండా ఆమె న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగుతున్నారు.
చదవండి: IND vs ENG: 'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'