BCCI: ప్రపంచకప్‌ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం? | Check All T20 WC Players Dropped From India Squad England Ireland T20Is | Sakshi
Sakshi News home page

BCCI: టీ20 ప్రపంచకప్‌ గెలిచినా.. ఆ ఐదుగురిపై వేటు!.. కారణం?

Jun 6 2026 5:42 PM | Updated on Jun 6 2026 6:40 PM

Check All T20 WC Players Dropped From India Squad England Ireland T20Is

ఊహాగానాలే నిజమయ్యాయి.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ను మార్చింది. టీమిండియాకు 2026లో ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు వేసింది. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. 

మూడేళ్లుగా జట్టులోనే లేడు
ఐర్లాండ్‌ పర్యటన నుంచే అయ్యర్‌ బాధ్యతలు చేపట్టనుండగా.. ఇంగ్లండ్‌ టూర్‌, ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా బీసీసీఐ జట్టును ప్రకటించేసింది. ఇక ఈ ఏడాదే టీమిండియాకు వరల్డ్‌కప్‌ అందించిన సూర్యను కాదని.. దాదాపుగా మూడేళ్లుగా అసలు టీ20 జట్టులోనే లేని శ్రేయస్‌ అయ్యర్‌ బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. 

గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో సారథిగా, బ్యాటర్‌గా ఈ ముంబైకర్‌ సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. మరోవైపు.. ఐపీఎల్‌-2026లో పరుగుల వరద పారించిన రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి కూడా తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచారు.

ఆ ముగ్గురిపై వేటు.. ఆ ఇద్దరికి విశ్రాంతి!
ఇదిలా ఉంటే.. స్వదేశంలో దాదాపు మూడు నెలల క్రితం టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన భారత జట్టులోని సభ్యుల్లో ఐదుగురిని ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్లకు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.  వీరిలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేశారు. అయితే, మిగతా నలుగురిని మాత్రం పూర్తిగా పక్కనపెట్టేశారు. వారెవరంటే..

సూర్యకుమార్‌ యాదవ్‌
కెప్టెన్‌గా 2023-2026 వరకు టీమిండియాను విజయపథంలో నడిపాడు సూర్యకుమార్‌ యాదవ్‌. అతడి సారథ్యంలో 52 మ్యాచ్‌లలో టీమిండియా ఏకంగా నలభై గెలిచింది.

అయితే ఒకప్పుడు ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్య గత కొంతకాలంగా విఫలమవుతున్నాడు. దీంతో సెలక్టర్లు నిర్దయగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులో కూడా చోటులేకుండా చేశారు.  టీ20 ప్రపంచకప్‌- 2028 టోర్నీని దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్ల సూర్యకు దాదాపుగా వీడ్కోలు పలికేశారు.

హార్దిక్‌ పాండ్యా
టీమిండియా టీ20 మాజీ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను కూడా ఈ టూర్ల నుంచి సెలక్టర్లు పక్కనపెట్టేశారు. ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ దారుణంగా విఫలమయ్యాడు.

అదే సమయంలో వెన్నునొప్పితోనూ ఈ ఆల్‌రౌండర్‌ సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2027 నాటికి అతడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సెలక్టర్లు టీ20 జట్టు నుంచి అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

కుల్దీప్‌ యాదవ్‌
ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైనప్పటికీ చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు తుదిజట్టులో చాన్నాళ్లుగా చోటు దక్కలేదు. అతడికి బదులు వరుణ్‌ చక్రవర్తికి యాజమాన్యం పెద్దపీట వేసింది. నిజానికి 2024, 2026లలో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్లలో సభ్యుడైనా 31 ఏళ్ల కుల్దీప్‌.. ఈ రెండు టోర్నీలలో కలిపి ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అయితే, ఈసారి అతడిని పూర్తిగా టీ20ల నుంచి పక్కనపెట్టేసి రవి బిష్ణోయికి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.

రింకూ సింగ్‌
గత కొంతకాలంగా టీ20 జట్టులో భాగమైన రింకూ.. 2024 వరల్డ్‌కప్‌ జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఏడాది ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. అయితే, ఫినిషర్‌గా తన వంతు పాత్ర పోషించడంలో రింకూ విఫలమయ్యాడు. ఐపీఎల్‌లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. దీంతో సెలక్టర్లు అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

జస్‌ప్రీత్‌ బుమ్రా
టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటిన జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఐపీఎల్‌-2026లో మాత్రం తేలిపోయాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున కేవలం నాలుగు వికెట్లే తీశాడు.

అయితే, బుమ్రా విషయంలో ప్రదర్శనను బట్టి కాకుండా.. అతడికి విశ్రాంతినిచ్చేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాను యూకే టూర్‌ నుంచి తప్పించారు. అయితే, ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు మాత్రం ఎంపిక చేశారు.

చదవండి: వైభవ్‌ వచ్చేశాడు!

Advertisement
 
Advertisement
Advertisement