IPL 2025: అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్‌గా ముస్తాఫిజుర్‌ | Record For Bangladesh In IPL As Mustafizur Rahman Dethrones Shakib Al Hasan | Sakshi
Sakshi News home page

IPL 2025: అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్‌గా ముస్తాఫిజుర్‌

May 25 2025 2:57 PM | Updated on May 25 2025 3:37 PM

Record For Bangladesh In IPL As Mustafizur Rahman Dethrones Shakib Al Hasan

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌లో అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్‌గా ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లాదేశీ బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఫిజ్‌.. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌కు అధిగమించాడు. షకీబ్‌ ఐపీఎల్‌లో 63 వికెట్లు తీయగా.. ఫిజ్‌ 65 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సీజన్‌లో లేట్‌గా (ఐపీఎల్‌ పునఃప్రారంభం తర్వాత స్టార్క్‌కు ప్రత్యామ్నాయంగా)  ఎంట్రీ ఇచ్చిన ఫిజ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌).. నిన్న (మే 24) పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో షకీబ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఫిజ్‌.. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఛాంపియన్‌గా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో ఫిజ్‌ 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌లకు ప్రాతినిథ్యం వహించిన ఫిజ్‌.. ఆయా జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు.

ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున మూడే మ్యాచ్‌లు ఆడిన ఫిజ్‌ తనదైన మార్కును చూపించాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిజ్‌ తొలుత ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్యను, ఆతర్వాత శశాంక్‌ సింగ్‌, మార్కో జన్సెన్‌ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఫిజ్‌ కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీ పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్‌ (28), జోష్‌ ఇంగ్లిస్‌ (32), స్టోయినిస్‌ (44 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రియాంశ్‌ ఆర్య (6), నేహల్‌ వధేరా (16), శశాంక్‌ సింగ్‌ (11), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (1), మార్కో జన్సెన్‌ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ 3, విప్రాజ్‌, కుల్దీప్‌ తలో 2, ముకేశ్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఢిల్లీ తరఫున సమీర్‌ రిజ్వి (58 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడగా.. కరుణ్‌ నాయర్‌ (44), కేఎల్‌ రాహుల్‌ (35), డుప్లెసిస్‌ (23), సెదీఖుల్లా అటల్‌ (22), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 నాటౌట్‌) కూడా అదే తరహా ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ 2, జన్సెన్‌, ప్రవీణ్‌ దూబే తలో వికెట్‌ పడగొట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement