నేటి నుంచి ప్రొ లీగ్ హాకీ
తొలి పోరులో నెదర్లాండ్స్తో ఢీ
రోటర్డామ్: భారత హాకీ జట్టు ఈ సీజన్లో వరుసగా మెగా టోర్నీలకు సిద్ధమవుతోంది. ముందుగా ఆగస్టు 15 నుంచి 30 వరకు ప్రపంచ కప్లో పాల్గొననున్న జట్టు...ఆ తర్వాత సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల్లో తలపడుతుంది. వీటికి ముందు యూరోప్లో మరింత సన్నద్ధత కోసం, తమ ఆటను మెరుగుపర్చుకునే క్రమంలో ప్రొ లీగ్ (యూరోపియన్ అంచె) టోర్నమెంట్లో బరిలోకి దిగుతోంది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది.
ఈ టూర్లో భాగంగా ముందుగా రెండు పటిష్ట యూరోప్ జట్లు నెదర్లాండ్స్, జర్మనీలతో భారత్ రెండేసి మ్యాచ్లలో తలపడుతుంది. ఈ క్రమంలో నేడు జరిగే పోరులో ఆతిథ్య నెదర్లాండ్స్ను ఎదుర్కోనున్న భారత్...జూన్ 21న మరోసారి డచ్ టీమ్ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్ల మధ్య జూన్ 17, 18 తేదీల్లో జర్మనీతో పోరుకు టీమ్ సన్నద్ధమైంది.
అనంతరం లండన్కు వెళ్లే భారత జట్టు పాకిస్తాన్, ఇంగ్లండ్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. తొమ్మిది జట్ల ప్రొ లీగ్లో ప్రస్తుతం భారత్ కేవలం 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ కప్ కూడా నెదర్లాండ్స్, బెల్జియంలలో జరగనున్న నేపథ్యంలో ఈ టూర్ తమకు కావాల్సిన అనుభవం అందిస్తుందని జట్టు ఆశిస్తోంది.
మన్ప్రీత్ సింగ్ రికార్డు...
భారత సీనియర్ ఆటగాడు మన్ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్తో కొత్త మైలురాయిని అందుకోనున్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు (411) ఆడిన మాజీ కెపె్టన్ దిలీప్ తిర్కీ రికార్డును అతను సమం చేయనున్నాడు. మరో మ్యాచ్లో బరిలోకి దిగితే 412 మ్యాచ్లతో కొత్త రికార్డు మన్ప్రీత్ ఖాతాలో చేరుతుంది.


