భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్బాష్ లీగ్ మ్యాచ్లను తొలిసారిగా భారత్లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.
ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్ రెగ్యులర్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.
తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీపై "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.
ఒకవేళ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్లు పరస్పర దేశాల్లో మ్యాచ్లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.


