PKL 11: సెమీస్‌కు దూసుకెళ్లిన దబంగ్‌ ఢిల్లీ | PKL 11: Dabang Delhi Beat Gujarat Giants Qualifies For Semi Final | Sakshi
Sakshi News home page

PKL 11: సెమీస్‌కు దూసుకెళ్లిన దబంగ్‌ ఢిల్లీ

Dec 24 2024 10:34 AM | Updated on Dec 24 2024 10:56 AM

PKL 11: Dabang Delhi Beat Gujarat Giants Qualifies For Semi Final

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదకొండో సీజన్‌లో మాజీ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీ జట్టు ఎదురులేని విజయాలతో సెమీఫైనల్స్‌కు దూసుకు వెళ్లింది. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 41–35తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొంది.. సెమీస్‌కు అర్హత సాధించింది. 

కాగా వరుసగా గత 15 మ్యాచ్‌లుగా దబంగ్‌ ఢిల్లీ ఒక్కటీ ఓడిపోలేదు. వీటిలో పదమూడింట గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. తద్వారా టాప్‌–2లో నిలిచి ఢిల్లీ నేరుగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. 

ఇక గుజరాత్‌తో జరిగిన పోరులో ఢిల్లీ కెప్టెన్, రెయిడర్‌ అశు మలిక్‌ 17 సార్లు కూతకెళ్లి 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు అతడి సహచరుల్లో ఆల్‌రౌండర్‌ ఆశిష్‌ 7, రెయిడర్‌ నవీన్‌ 6, డిఫెండర్‌ ఆశిష్‌ 4 పాయింట్లు సాధించారు.

ఆరు జట్లు నాకౌట్‌కు
మరోవైపు.. గుజరాత్‌ తరఫున ఆల్‌రౌండర్‌ జితేందర్‌ యాదవ్‌ (7) ఆకట్టుకోగా, కెప్టెన్‌ గుమన్‌ సింగ్‌ (5), హిమాన్షు (5) రాణించారు. ఇదివరకే టాప్‌లో నిలిచిన హరియాణా స్టీలర్స్‌తో పాటు ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా సెమీస్‌కు అర్హత సంపాదించాయి. తర్వాత 3, 4, 5, 6వ స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో ఆడి ఇందులోంచి రెండు జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి.

తమిళ్‌ తలైవాస్‌పై గెలుపు
ఇదిలా ఉంటే.. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 42–32తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. పుణేరి రెయిడర్లు ఆర్యవర్ధన్‌ నవలే (10), అజిత్‌ (7) అదరగొట్టారు. డిఫెండర్లలో గౌరవ్‌ ఖత్రి (5), అమన్‌ (4) రాణించారు. 

తలైవాస్‌ తరఫున ఆల్‌రౌండర్‌ హిమాన్షు (8), రెయిడర్‌ సచిన్‌ (7) పోరాడారు. కెప్టెన్, డిఫెండర్‌ నితేశ్‌ కుమార్‌ 5, అమిర్‌ హుస్సేన్‌ 4 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధాస్, బెంగాల్‌ వారియర్స్‌తో యు ముంబా తలపడతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement