ఫాదీ హమ్దల్లా అల్-నస్సాన్(ఫైల్ ఫోటో)
పాలస్తీనా క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్రమిత పశ్చిమ తీరం (వెస్ట్ బ్యాంక్)లో ఇజ్రాయెల్ సెటిలర్లు, సైన్యం జరిపిన దాడిలో గాయపడిన పాలస్తీనా యువ ఫుట్బాల్ ప్లేయర్ ఫాదీ హమ్దల్లా అల్-నస్సాన్ (17) శనివారం రాత్రి మరణించాడు. ఫాదీ తీవ్రమైన గాయాలతో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
ఏమి జరిగిందంటే?
జూలై 11న వెస్ట్ బ్యాంక్లోని ఫాదీ హమ్దల్లా గ్రామంపై ఇజ్రాయెల్ సెటిలర్లు, బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడిలో మహిళల అరుపులు విని వారిని రక్షించడానికి వెళ్లిన ఫాదీపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపాయి. తీవ్రంగా గాయపడిన ఫాదీని అస్పత్రికి తరలించారు.
గాయం తీవ్రమవడంతో వైద్యులు అతడి కాలును తొలగించాల్సి వచ్చింది, అయినప్పటికీ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఈ ఘటనపై పాలస్తీనా ఫుట్బాల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది.
2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 568 ఫుట్బాల్ ప్లేయర్లు మరణించినట్లు పీఫ్ఎ అధికారికంగా తెలిపింది. కాగా ఫాదీ అల్-నస్సాన్ స్థానిక 'అల్-ముఘయ్యిర్' క్లబ్కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు, పాలస్తీనా జాతీయ యువ ఫుట్బాల్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.


