
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించింది. లాహోర్ వేదికగా స్కాట్లాండ్ మహిళలతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 32 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
స్కాటిష్ బ్యాటర్లలో కెప్టెన్ కాథరిన్ బ్రైస్(91) టాప్ స్కోరర్గా నిలవగా.. అలీసా లిస్టర్(31), సారా బ్రైస్(21) పర్వాలేదన్పించారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సానా నాలుగు వికెట్లతో చెలరేగింది. సానా 5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 వికెట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఆమెతో పాటు సాదియా ఇక్బాల్ రెండు, డయానా బేగ్ ఓ వికెట్ సాధించింది.
అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని పాక్ 30.4 ఓవర్లలో చేధించింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ(71), అలియా రియాజ్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. స్కాట్లాండ్ బౌలర్లలో చోలీ అబెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. రిచెల్ స్లాటెర్, కాథరిన్ ఫ్రేజర్ తలా వికెట్ సాధించారు. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 14న వెస్టిండీస్తో తలపడనుంది. పాకిస్తాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: IPL 2025: సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ?