మహిళల ఆసియాకప్-2026లో దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అయితే ఈ ఘోర పరాభవం తర్వాత పాకిస్తాన్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ జట్టు చిత్తు చిత్తుగా ఓడినప్పటికీ, ఆసియాకప్ టోర్నీలోనే అత్యుత్తమ జట్టు పాకిస్తానేనంటూ అతడు అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ మ్యాచ్లో పాక్ బ్యాటర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. శ్రీచరణి, ప్రేమా రావత్, దీప్తి శర్మ వంటి స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటింగ్ లైనప్ మొత్తం విలవిల్లాడింది. ఓపెనర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ తమ జట్టును రియాజ్ వెనకేసుకురావడం హాస్యాస్పదంగా మారింది.
"మా జట్టులోని ప్లేయర్లందరికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. కానీ వారు తమను తాము నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. భారత్తో జరిగిన మ్యాచ్లో చేసిన తప్పులపై చర్చించి, తదుపరి హాంకాంగ్తో మ్యాచ్లో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటాం.
ఈ ఆసియాకప్ ట్రోఫీని గెలిచే అత్యుత్తమ జట్టు ఇప్పటికీ పాకిస్తానేనని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూఏఈ పరిస్థితులు మాకు బాగా తెలుసు. మా జట్లు ఇక్కడ చాలా క్రికెట్ ఆడాయి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రియాజ్ పేర్కొన్నాడు. కాగా రియాజ్ వ్యాఖ్యలకు భారత ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. 'నిజంగానే పాక్ బెస్ట్ టీమ్.. అందుకే 55 పరుగులకు ఆలౌటైంది' ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్


