
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కివీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 88 పరుగులకే కుప్పకూలింది.
లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ వలలో కివీస్ చిక్కుకుంది. జయసూర్య తన మాయాజాలంతో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కీలక వికెట్లు పడగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్లో జయసూర్య 6 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్లో 7 మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయమయ్యారు. మిచెల్ శాంట్నర్(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇక తొలి ఇన్నింగ్స్లో ఘోర ప్రదర్శన కరబరిచిన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. ఫాలో ఆన్లో కూడా కివీస్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇంకా 385 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో లంక చేతిలో కివీస్ ఓటమి చవిచూసింది.