
Team India Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోచ్గా అవతారమెత్తిన టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అనూహ్యరీతిలో ముందుకు దూసుకుపోతున్న విషయం విదితమే. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత అతడిది. మలి ప్రయత్నంలోనూ నెహ్రా మార్గదర్శనం చేసిన టీమ్ రన్నరప్గా నిలవడం విశేషం.
టీమిండియా కోచ్ అయితే బాగుంటుంది
ఈ నేపథ్యంలో నెహ్రా కోచింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు భవిష్యత్తులో అతడికి టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.
ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువ అనుభవం ఉన్న నెహ్రాను పరిమిత ఓవర్ల కోచ్గా నియమించాలని భజ్జీ గతంలో సూచించాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది.
తెరమీదకు నెహ్రా పేరు
ఈ నేపథ్యంలో మెగా టోర్నీ తర్వాత అతడు కోచ్గా కొనసాగడానికి ఇష్టపడతాడా? లేదంటే బాధ్యతల నుంచి తప్పుకొంటాడా? అన్న సందేహాల నడుమ ఆశిష్ నెహ్రా పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ ద్రవిడ్ కాంట్రాక్ట్ పునురుద్ధరించుకుంటే.. టెస్టు జట్టు కోచ్గా అతడు ఉంటే.. నెహ్రాకు వన్డే, టీ20 బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆసక్తి లేదన్న నెహ్రా! కారణమిదే
ఈ క్రమంలో ఆశిష్ నెహ్రా మాత్రం తన సన్నిహితుల వద్ద.. తాను టీమిండియా హెడ్కోచ్ పదవిపై ఆసక్తిగా లేనని చెప్పినట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్తో 2025 వరకు ఒప్పందం ఉన్న కారణంగా ఈ మేరకు బీసీసీఐ పదవిని నెహ్రా తిరస్కరించే అవకాశం ఉన్నట్లు పీటీఐ కథనంలో పేర్కొంది.
తొలి సీజన్లో ట్రోఫీ గెలిచి
కాగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్లీగ్లో ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో నెహ్రా మార్గదర్శనంలో తమ తొలి సీజన్లో టైటిల్ గెలిచి సత్తా చాటింది.
ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాతే ద్రవిడ్ కోచ్గా కొనసాగుతాడా లేదా అన్న విషయం తేలుతుంది. ఈలోపే ఇలా ఊహాగానాలు వెలువడటం గమనార్హం.
చదవండి: WC 2023: తిలక్ ఉండగా అతడిని ఎలా సెలక్ట్ చేస్తారు: ఆసీస్ మాజీ క్రికెటర్