
గతంలో వాయిదాపడ్డ ఈవెంట్కు కొత్త షెడ్యూల్ ఖరారు
బెంగళూరు: భారత ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్కు కొత్త షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 5న బెంగళూరులో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ల ఉమ్మడి భాగస్వామ్యంతో చోప్రా గత నెలలోనే ఈ అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు. కానీ పహల్గాంలో ఉగ్రదాడి దరిమిలా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్, పాక్ల మధ్య డ్రోన్ దాడులతో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో భారత్లోని కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం తదితర ప్రతికూల పరిస్థితులతో మే 24న క్రీడాఈవెంట్ను నిర్వహించే వాతావరణం లేకపోయింది.
ఈ జావెలిన్ త్రో టోర్నీయే కాదు... ప్రముఖ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కూడా వాయిదా పడింది! ఇప్పుడు ఉద్రిక్తతలు సద్దుమణగడంతో నీరజ్ చోప్రా, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ వాయిదా పడిన ఈవెంట్ నిర్వహణకు తుదికసరత్తు పూర్తి చేసి జూలై 5 నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది స్టార్ అంతర్జాతీయ జావెలిన్ త్రోయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో చోప్రా సహా ఐదుగురు భారత అథ్లెట్లు కాగా... ఏడుగురు విదేశీ అథ్లెట్లు ఉన్నారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి.
భారత్ నుంచి నీరజ్తో పాటు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజతం నెగ్గిన సచిన్ యాదవ్, కిషోర్ జేనా, రోహిత్ యాదవ్, సాహిల్ పాల్గొంటున్నారు. విదేశీ స్టార్లలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోహ్లెర్ (జర్మనీ), 2015 ప్రపంచ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కుర్టిస్ థాంప్సన్ (అమెరికా), ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గెన్కీ డీన్ (జపాన్), రుమేశ్ పతిరగె (శ్రీలంక), లూయిజ్ మారిసియో (బ్రెజిల్) భారత్లో జరిగే ఈవెంట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా చూసేందుకు రూ. 199 నుంచి రూ. 9999 ధర పలికే టికెట్లను అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ బాక్స్ ప్రేక్షకుల కోసం రూ. 44,999 టికెట్లు ఉన్నాయి.