
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... ఒ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గతవారం పారిస్ డైమండ్ లీగ్ మీట్లో ‘టాప్’లో నిలిచిన నీరజ్... మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో నీరజ్కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం.
ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ (84.12 మీటర్లు; దక్షిణాఫ్రికా), అండర్సన్ పీటర్స్ (83.63 మీటర్లు; గ్రెనెడా) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు.
మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్న భారత అథ్లెట్.. తర్వాతి ప్రయత్నాల్లో ఆకట్టుకోలేకపోయాడు. నీరజ్ కోచ్, చెక్ రిపబ్లిక్ గ్రేట్ అథ్లెట్ జాన్ జెలెజ్నీ గతంలో ఈ మీట్లో తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు.
