నీరజ్‌ సిద్ధం... | Neeraj Chopra to compete in the Doha Diamond League today | Sakshi
Sakshi News home page

నీరజ్‌ సిద్ధం...

Jun 19 2026 3:28 AM | Updated on Jun 19 2026 3:28 AM

Neeraj Chopra to compete in the Doha Diamond League today

నేడు దోహా డైమండ్‌ లీగ్‌లో బరిలోకి 

విరామం తర్వాత పూర్తి ఫిట్‌గా భారత జావెలిన్‌ త్రోయర్‌

దోహా: భారత స్టార్‌ జావెలియన్‌ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా గత ఏడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా ఫీల్డ్‌లో నిలిచాడు. టోక్యోలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన అతను ఎనిమిదో స్థానంతో ముగించాడు. టోక్యో ఈవెంట్‌ తర్వాత విరామం తీసుకున్న అతను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 

ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌తో అతని కొత్త సీజన్‌ మొదలవుతోంది. లీగ్‌లోని ఆరు అంచెల్లో భాగంగా రబత్‌ (మొరాకో), రోమ్‌ (ఇటలీ)లలో జరిగిన తొలి రెండు ఈవెంట్లలో నీరజ్‌ పాల్గొనలేదు. ఇప్పుడు దోహా (ఖతర్‌)లో జరిగే మూడో అంచె పోటీల్లో అతను పోటీ పడుతున్నాడు. నేడు జరిగే పోరులో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నీరజ్‌ పట్టుదలగా ఉన్నాడు. తనకు అచ్చొచ్చిన ఈ వేదికపై గత ఏడాది భారత అథ్లెట్‌ తొలిసారి 90 మీటర్లకు పైగా (90.23 మీటర్లు) జావెలిన్‌ విసిరాడు. 

‘నిజానికి నేను గత ఏడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సమయంలో గాయంతో బాధపడుతున్నా. అయినా సరే బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదు. అయితే ఏడాదిలో అది చివరి ఈవెంట్‌ కావడంతో నాకు తప్పలేదు. అథ్లెట్ల కెరీర్‌లో గాయాలు భాగం. భుజం, మడమ గాయాలతో నేను ఇబ్బంది పడ్డా. అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నీ దూరమయ్యాయి. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా మారి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని భావిస్తున్నా’ అని నీరజ్‌ చెప్పాడు.  

అందుకే కోచ్‌గా విడిపోయా! 
తన కెరీర్‌లో మంచి ఫలితాలు సాధించడంలో భాగంగా ఉన్న వ్యక్తిగత కోచ్‌ యాన్‌ జెలెన్జీతో గత జనవరిలో విడిపోయిన చోప్రా... ప్రస్తుతం భారత్‌కే చెందిన జైవీర్‌ చౌదరితో కలిసి పని చేస్తున్నాడు. ‘జెలెన్జీ చాలా మంది అథ్లెట్, గొప్ప కోచ్‌ కూడా. మేమిద్దరం పలు అంశాలపై కలిసి పని చేశాం. అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే 90 మీటర్లకు పైగా జావెలిన్‌ విసరడం సంతోషకర క్షణం. 

అయితే ఆయనతో కలిసి పని చేయాలంటే సీజన్‌ మొత్తం ఒకే చోట ఉండాల్సి రావడం నాకు సాధ్యం కావడం లేదు. పైగా నా శైలిలో కొన్ని కొత్త ఆలోచనలతో పని చేయాలని భావించడం వల్లే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత ఆయనతో విడిపోయా. జైవీర్‌తోనే కలిసి నేను జావెలిన్‌ మొదలు పెట్టా. గత 15–16 ఏళ్లుగా నా గురించి, నా శిక్షణ గురించి అతనికి బాగా తెలుసు. అందుకే కొన్ని సాంకేతిక అంశాలపై జైవీర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని నీరజ్‌ స్పష్టం చేశాడు.  

కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కూడా... 
ఈ ఏడాది ఒలింపిక్స్, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ లేకపోవడంతో తనపై మానసికంగా కాస్త ఒత్తిడి తగ్గిందని చోప్రా వ్యాఖ్యానించాడు. అయితే కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలతో బిజీగా ఉండనున్నట్లు అతను చెప్పాడు. కామన్వెల్త్‌ క్రీడల కోసం ఎంపిక చేసిన 32 మంది సభ్యుల భారత అథ్లెటిక్స్‌ బృందంలో చోప్రా కూడా ఉన్నాడు.

‘శ్రీలంక ఆటగాడు రుమేశ్‌ పతిరగే, పారిస్‌ ఒలింపిక్స్‌ విజేత అర్షద్‌ నదీమ్‌లతో పాటు వరల్డ్‌ చాంపియన్‌ వాల్కాట్, మాజీ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ కూడా కామన్వెల్త్‌ గేమ్స్‌ బరిలోకి దిగుతున్నారు. వీరంతా 90 మీటర్లకు పైగా జావెలియన్‌ విసిరినవారే. కాబట్టి పోటీపరంగా ఇదేమీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కంటే తక్కువేమీ కాదు. కాబట్టి తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో కూడా పాల్గొనాలని భావిస్తున్నా’ అని నీరజ్‌ వెల్లడించాడు.  

త్వరలోనే ఎన్‌సీ క్లాసిక్‌... 
నీరజ్‌ చోప్రా గత ఏడాది జులైలో బెంగళూరులో తన పేరిట ఎన్‌సీ క్లాసిక్‌ ఈవెంట్‌ నిర్వహించాడు. అయితే ఈ ఏడాది దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై మాట్లాడుతూ నీరజ్‌... ‘గత ఏడాది ఒక్క జావెలిన్‌ త్రో ఈవెంట్‌కు 15 వేల మంది ప్రేక్షకులు హాజరు కావడం నిజంగా గర్వించే అంశం. దీంతో పాటు మరికొన్ని ఈవెంట్లు చేర్చాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై నా బృందం కలిసి పని చేస్తోంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని నీరజ్‌ చెప్పాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement