భారత్-పాకిస్తాన్ మధ్య 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పెద్దగా కనిపించని పాకిస్తాన్ నౌకాదళం.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. చైనా సాయంతో నిర్మించిన అత్యాధునిక హంగోర్-క్లాస్ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం నౌకాదళ విస్తరణేనా? లేక 1971 తర్వాత కోల్పోయిన వ్యూహాత్మక ప్రభావాన్ని తిరిగి సాధించాలనే ప్రయత్నమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
1971లో ఏం జరిగింది?
1971 యుద్ధం పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద సైనిక, రాజకీయ పరాజయం. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. దీంతో పాక్కు బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ (PNS Ghazi) విశాఖపట్నం సమీపంలో మునిగిపోయింది. తూర్పు ప్రాంతంలో భారత నౌకాదళం సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్కు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం దాదాపు లేకుండాపోయింది. అప్పటి నుంచి పాక్ నౌకాదళం ప్రధానంగా అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ ప్రాంతాలకే పరిమితమైంది.
పాక్ ప్లానేంటి?
పాకిస్తాన్ నౌకాదళం చైనా సహకారంతో కొనుగోలు చేస్తున్న 8 హంగోర్-క్లాస్ జలాంతర్గాములు దాని సముద్ర వ్యూహంలో పెద్ద మార్పునకు నాంది పలుకుతున్నాయి. మొదటి జలాంతర్గామి PNS హాంగోర్ ఇప్పటికే పాక్ నౌకాదళంలో చేరింది. మిగిలినవి 2028 నాటికి దశలవారీగా చేరనున్నాయి. పాక్ నౌకాదళ అధికారుల ప్రకారం.. ఈ కొత్త సామర్థ్యాలతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది.
హంగోర్ జలాంతర్గాముల ప్రత్యేకత?
ఈ జలాంతర్గాములు చైనా Type-039B యూవాన్ క్లాస్ నమూనా ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ సామర్థ్యాల వల్ల పాక్ నౌకాదళానికి గతంతో పోలిస్తే గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వీటి ప్రధాన ప్రత్యేకతలు:
AIP (Air Independent Propulsion) టెక్నాలజీ
నీటి అడుగున ఎక్కువకాలం ప్రయాణించే సామర్థ్యం
తక్కువ శబ్దంతో కదిలే స్టెల్త్ సిస్టమ్
ఆధునిక సోనార్, సెన్సార్ వ్యవస్థలు
టార్పెడోలు, యాంటీ-షిప్ క్షిపణుల సామర్థ్యం
భవిష్యత్తులో బాబర్-3 క్రూయిజ్ క్షిపణుల వినియోగ అవకాశాలు
చైనా పాత్ర ఎంత కీలకం?
ఈ ప్రాజెక్టు వెనుక అసలు శక్తి చైనానే. హంగోర్ జలాంతర్గాముల ఒప్పందం విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. నాలుగు జలాంతర్గాములు చైనాలో, మరో నాలుగు కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు. భారత్ చుట్టూ "స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్" వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా, గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు.
భారత్కు ఆందోళన అంశమేనా?
సైనికంగా చూస్తే ప్రస్తుతం భారత నౌకాదళం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్లు, దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థలు, తూర్పు నౌకాదళ కమాండ్ వంటి అంశాల్లో భారత్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. అయితే, పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల భారత నౌకాదళం తన తూర్పు తీర భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే భారత్ కూడా కొత్త జలాంతర్గాముల కొనుగోలు, దేశీయ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.
బంగ్లాదేశ్ అంశం కూడా కీలకమే
పాక్ బంగాళాఖాతంలో ఉనికిని పెంచాలంటే బంగ్లాదేశ్తో సంబంధాలు కీలకం కానున్నాయి. గత కొంతకాలంగా ఇస్లామాబాద్-ఢాకా సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతం ఇప్పటికీ భారత ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందువల్ల పాక్ ఉనికి పెరిగినా, అది ఎంత స్థాయిలో ప్రభావం చూపగలదన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. కాగా, వాస్తవానికి బంగాళాఖాతంలో పాక్ నిరంతర ఉనికి కొనసాగించడం అంత సులభం కాదు. భౌగోళిక పరిమితులు, లాజిస్టిక్స్, భారత నౌకాదళ ఆధిపత్యం వంటి అంశాలు ఇప్పటికీ ఇస్లామాబాద్కు పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి.


