త్రిస్సూర్: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. విదేశాల నుండి చౌకగా లభించే చమురు భారతదేశానికి చేరుకోవడానికి అనేక సాంకేతిక, రవాణా పరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం త్రిస్సూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల పెరిగిన ఇంధన ధరలు, పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏర్పడిన నష్టాలు, కేరళలో ఎయిమ్స్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తక్షణమే ధరలు తగ్గకపోవడానికి కారణాలివే
అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పడిపోయిన వెంటనే ఇక్కడి మార్కెట్లో ధరలను తగ్గించడం కుదరదని కేంద్ర మంత్రి సురేష్ గోపి తేల్చి చెప్పారు. విదేశాల నుండి తక్కువ ధరకే ముడి చమురు లభించినప్పటికీ, అది హార్ముజ్ జలసంధి గుండా భారీ నౌకల రద్దీని దాటుకుని భారతదేశానికి చేరుకోవడానికి గణనీయమైన సమయం పడుతుందని వివరించారు. ఈ రవాణా వ్యవస్థ అంతా సాధారణ స్థితికి రావాల్సి ఉందన్నారు. ఇటీవల పెరిగిన ఇంధన ధరలలో కేవలం లీటరుకు రూ. 3.94 మేర పెరిగిన ప్రభావం మాత్రమే ప్రజలపై పడిందని, అయితే ప్రపంచవ్యాప్తంగా రేట్లు తగ్గాయనే కారణంతో దీనిని వెంటనే వెనక్కి తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు.
చమురు కంపెనీల మనుగడ - కేంద్రంపై భారం
ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ నష్టాన్ని చాలా వరకు భరించిందని చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 12,000 కోట్ల మేర నష్టపోయిందని వెల్లడించారు. ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని, ఆదాయాన్ని వదులుకోలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగాలన్నా, చమురు కంపెనీలు మనుగడ సాగించాలన్నా ఇవన్నీ తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు.
కేరళ ఎయిమ్స్ వివాదంపై వివరణ
కేరళలో ఎయిమ్స్ ఆస్పత్రిపై ఏర్పాటుపై వస్తున్న వార్తలపై కూడా సురేష్ గోపి స్పందించారు. మార్కెట్కు వెళ్లి షాపింగ్ చేసినంత సులువుగా ఎయిమ్స్ ఏర్పాటు జరగదని, దీనికి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. కేరళలో ఎక్కడైనా ఎయిమ్స్ ఏర్పాటు చేయవచ్చని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ చేసిన వ్యాఖ్యల్లో కొంత అసమగ్రత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎయిమ్స్ కోసం గుర్తించిన స్థలాల వివరాలను సంబంధిత కమిటీకి తెలియజేయాలని, ఆ తర్వాతే తుది లొకేషన్ ఎంపికపై చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. మురళీధరన్ తనతో మాట్లాడతానని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: డాక్టర్.. ఎక్స్రే తిప్పి చూశారా? కళ్లకు ప్లాస్టర్ వేసుకున్నారా?


