దేవరియా: ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో ఘోర వైద్య నిర్లక్ష్యం వెలుగుచూసింది. మహర్షి దేవరహా బాబా మెడికల్ కాలేజీ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ ఆరేళ్ల చిన్నారి ఇక్కట్ల పాలయ్యింది. ఆడుకుంటూ కిందపడి కుడిచేయి విరగ్గొట్టుకున్న బాలికకు, అక్కడి సిబ్బంది బాగున్న ఎడమచేతికి ప్లాస్టర్ కట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
కుడిచేయి విరిగితే.. ఎడమచేతికి కట్టు
దేవరియాలోని భుజౌలీ కాలనీకి చెందిన అల్పనా ఉపాధ్యాయ కుమార్తె (6)ఆడుకుంటూ కిందపడటంతో ఆమె కుడిచేతికి తీవ్ర గాయమైంది. కంగారుపడిన తల్లి వెంటనే ఓ ప్రైవేట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ఎక్స్రే తీయించింది. అందులో కుడిచేయి ఫ్రాక్చర్ (ఎముక విరగడం) అయినట్లు తేలింది. ఆ రిపోర్టు పట్టుకుని ఆమె నేరుగా మహర్షి దేవరహా బాబా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఓపీ విభాగంలోని ఆర్థోపెడిక్ (ఎముకల) వైద్యుడు ప్రిస్క్రిప్షన్ రాసి, పక్కనే ఉన్న ప్లాస్టర్ రూమ్కు వెళ్లమన్నాడు.
ఎక్స్రే చూసినా కూడా..
బాధిత తల్లి ప్లాస్టర్ గదికి వెళ్లి ప్రభుత్వ రుసుము చెల్లించింది. అక్కడ ఉన్న సిబ్బందికి డాక్టర్ రాసిన పత్రాలు, కుడిచేతి ఎక్స్రే రిపోర్టును కూడా చూపించింది. అయితే కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించిన ఆ ఉద్యోగి, రిపోర్టును సరిగ్గా గమనించకుండానే బాలిక యొక్క బాగున్న ఎడమచేతికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టు వేశారు. ఇంటికి వెళ్లాక కూడా చిన్నారి కుడిచేతి నొప్పితో విలవిలలాడటంతో గమనించిన తల్లి, ఆసుపత్రి సిబ్బంది చేసిన ఘోర తప్పిదాన్ని చూసి షాక్కు గురైంది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ ఘోర నిర్లక్ష్యంపై సదరు తల్లి సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకుంటూ ఆసుపత్రి తీరును ఎండగట్టింది. ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపించడంతో ఉన్నతాధికారులు దిగివచ్చారు. దీనిపై మెడికల్ కాలేజీ సీఎంఎస్ (చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్) డాక్టర్ హెచ్.కె. మిశ్రా స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా తప్పు చేసిన డాక్టర్ లేదా ప్లాస్టర్ రూమ్ సిబ్బందిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం!


