PC: X
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా గాయపడ్డాడు. ఫలితంగా ఆసియా క్రీడలకు అతడు దూరమయ్యాడు.
అదే విధంగా.. డైమండ్ లీగ్ ఫైనల్, వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్షిప్స్లో కూడా నీరజ్ చోప్రా పాల్గొనలేకపోతున్నాడు. కాగా ఇటీవల లుసానే డైమండ్ లీగ్లో నీరజ్ ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈటెను 88.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థీనంలో నిలిచాడు. అంతకుముందు దోహా డైమండ్ లీగ్లోనూ రాణించిన నీరజ్.. ఓవరాల్గా 12 పాయింట్లు సాధించిన లీగ్ ఫైనల్కు చేరుకున్నాడు.
చీలమండ గాయం
ఈ క్రమంలో బ్రసెల్స్లో సెప్టెంబరు 5న జరిగే డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ పాల్గొనాల్సి ఉండగా.. చీలమండ గాయంతో టైటిల్ పోరుతో పాటు ఆసియా క్రీడలకు కూడా దూరమయ్యాడు. కాగా ఆసియా క్రీడలు సెప్టెంబరు 19న జపాన్ వేదికగా మొదలుకానున్నాయి. ఇక ఇక్కడే జరిగిన టోక్యో ఒలింపిక్స్-2020లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం సాధించాడు. ఇక ఇటీవల కామన్వెల్త్ క్రీడలు-2026లో వెండి పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా.. లుసానే డైమండ్ లీగ్ సందర్భంగానే తన గాయం తీవ్రతరమైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
బాధగా ఉంది
ఈ మేరకు.. ‘‘ఎంతో కఠిన శ్రమ తర్వాత లుసానే డైమండ్ లీగ్లో ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. అయితే, దురదృష్టవశాత్తూ ఆ తర్వాత కాసేపిటకే నా చీలమండలో నొప్పి మొదలైంది. శిక్షణ సమయంలో బాగా ఇబ్బంది పడ్డాను.
నా వైద్యుడు, మా బృందంతో చర్చించిన తర్వాత ఈ సీజన్లో మిగిలిన టోర్నీలన్నింటి నుంచి విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నిజంగా నేను తీవ్ర నిరాశకు లోనయ్యాను. గాడిన పడుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరం.
ఏదేమైనా ఈ ప్రయాణంలో ఎత్తుపళ్లాలు సహజం. కోలుకోవడంపై దృష్టి పెట్టి.. మరింత బలంగా తిరిగివస్తాను. నాపై ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని నీరజ్ చోప్రా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.


