PC: Instagram
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం భారత పేస్ విభాగంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు ఈ హైదరాబాదీ. ఆటో డ్రైవర్ అయిన తండ్రి, కుటుంబం ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు.
కిరాయి ఇంట్లో నివసించే స్థితి నుంచి జూబ్లీహిల్స్లో విలాసవంతమైన బంగ్లాను సొంతం చేసుకున్న సిరాజ్.. హోటల్ రంగంలోనూ అడుగుపెట్టాడు. కాగా సిరాజ్కు ఒకే తోబుట్టువు అయిన అన్నయ్య మహ్మద్ ఇస్మాయిల్ ఉన్నాడు.
అయితే, క్రికెటర్గా గుర్తింపు పొందిన తర్వాత సిరాజ్కు ఓ చెల్లి కూడా దొరికింది. ఆమె పేరు జనై భోస్లే. జనై మరోవరో కాదు దిగ్గజ గాయని ఆశా భోస్లే మనుమరాలు అన్న విషయం తెలిసిందే. ఆమె కూడా సింగరే. అయితే, కొన్నాళ్ల క్రితం సిరాజ్- జనై పరస్పరం నవ్వులు చిందిస్తున్న ఫొటో ఒకటి బయటకు రావడంతో వదంతులు పుట్టుకొచ్చాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనేది వాటి సారాంశం.

అయితే, జనైతో పాటు సిరాజ్ కూడా అర్థంపర్థంలేని రూమర్లను కొట్టిపారేశారు. తమ మధ్య సోదర- సోదరీ బంధం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జనై భోస్లే మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది. సిరాజ్కు రాఖీ కట్టిన పాత ఫొటోను తాజాగా పంచుకుంటూ..
‘‘మన ఇద్దరం ఎంచుకున్న బంధం ఇది. మనకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నయ్యా. నాకు ఇంత మంచి అన్నయ్య దొరికినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను రక్షించే వ్యక్తి. నా ప్రాణ స్నేహితుడు’’ అని జనై భోస్లే పేర్కొంది.

అదే విధంగా ఇన్స్టా స్టోరీలోనూ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఫొటో కింద రాసిన వాక్యాలను చదవడం అస్సలు మర్చిపోవద్దు. అన్నిటికంటే అవే అత్యంత ముఖ్యమైనవి’’ అంటూ తమ గురించి చెడుగా వదంతులు వ్యాప్తి చేసిన వారికి మరోసారి జనై గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా ఆశా భోస్లే మరణించిన సమయంలో సిరాజ్ ముంబైకి వెళ్లి.. అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బాధాకర సమయంలో జనైకి మద్దతుగా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. సిరాజ్ ఇటీవలే శ్రీలంక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి వచ్చాడు. గాలె వేదికగా లంకతో తొలి టెస్టులో మొత్తంగా రెండు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. కొలంబోలో జరిగిన రెండో టెస్టులోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.


