తమిళనాడు ప్రీమియర్ లీగ్-2026 విజేతగా విడా కోవై కింగ్స్ నిలిచింది. చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో మదురై పాంథర్స్ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన కోవై కింగ్స్.. ముచ్చటగా మూడోసారి టీఎన్పీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ తుది పోరులో కోవై కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన విడా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఆటగాడు ఆండ్రే సిద్ధార్థ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన 20వ పుట్టిన రోజున అతడు విధ్వంసం సృష్టించాడు. సిద్ధార్థ్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. కెప్టెన్ షారుఖ్ ఖాన్(1) మాత్రం విఫలమయ్యాడు.
బ్యాట్తో నిరాశపరిచిన షారుఖ్ ఖాన్ బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. అతడు మూడు వికెట్లతో సత్తాచాటాడు. షారుఖ్తో పాటు మణిమారన్ సిద్ధార్థ్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా మదురై పాంథర్స్ లక్ష్య చేధనలో 98 పరుగులకే కుప్పకూలింది. రన్నరప్గా నిలిచిన మధురై బ్యాటర్లలో ఎన్.ఎస్. చతుర్వేద్(40) ఒక్కడే రాణించాడు. ఇక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా సిద్ధార్థ్ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు బాలసుబ్రహ్మణ్యం సచిన్కు దక్కింది.


