source: X
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ (WCPL)లో ఈసారి నలుగురు భారత క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ (ఐదవది) కోసం శుక్రవారం జరిగిన డ్రాఫ్ట్లో టీమిండియాకు చెందిన పూజా వస్త్రాకర్, కిరణ్ నవగిరే, శిఖా పాండే, యస్తిక భాటియాను వేర్వేరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్స్ బార్బడోస్ ట్రైడెంట్స్ పూజా వస్త్రాకర్, కిరణ్ నవగిరేలను తమ విదేశీ ప్లేయర్ల కోటాలో చేర్చుకోగా.. ట్రిన్బాగో నైట్ రైడర్స్ శిఖా పాండే, యస్తిక భాటియాలను ఎంపిక చేసుకుంది. వీరిలో శిఖాకు ఇప్పటికే WCPLలో అనుభవం (2024 నుంచి) ఉండగా.. మిగతా ముగ్గురికి ఇదే తొలి సీజన్ కానుంది.
గతంలో జెమీమా రోడ్రిగ్స్ (2024), శ్రేయాంక పాటిల్ (2023-25) వంటి టీమిండియా స్టార్లు కూడా WCPLలో పాల్గొన్నారు. మొత్తంగా WCPL 2026లో నలుగురు భారతీయుల ప్రవేశం అంతర్జాతీయ ఫ్రాంచైజీ క్రికెట్లో భారత మహిళా క్రికెటర్లకు పెరుగుతున్న అవకాశాలకు సంకేతంగా నిలుస్తోంది.
కాగా, WCPL 2026 తొలి మ్యాచ్లో బార్బడోస్ ట్రైడెంట్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అదే రోజు జరిగే మరో మ్యాచ్లో జమైకా ఎంప్రెస్, గయానా అమెజాన్ వారియర్స్ పోటీపడతాయి. ఈ సీజన్ సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్తో ముగుస్తోంది. మరోవైపు ఇదివరకే మొదలైన పురుషుల కరీబియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన పోలార్డ్


