
అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టిన భారత స్టార్ జావలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) టాప్ లేపాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే 2 టైటిల్స్తో అదరగొట్టి మళ్లీ నంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ పక్కకు నెట్టి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.
వరల్డ్ అథ్లెటిక్స్ ఈ వారం ప్రారంభంలో ర్యాంకింగ్స్ను అప్డేట్ చేసింది. దీని ప్రకారం 1,445 పాయింట్లతో నీరజ్ చోప్రా మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఆండర్సన్ పీటర్స్ 1,431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడని ఒలింపిక్స్.కామ్ వెల్లడించింది. పాకిస్తాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. దోహా డైమండ్ లీగ్లో ఈటెను 91.06 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించిన జర్మనీ త్రోవర్ జూలియన్ వెబర్ తాజా ర్యాంకింగ్స్లో 3వ స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన టోక్యో 2020 ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వాడ్లెజ్ 5వ స్థానంలో ఉన్నాడు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత, 2024 సెప్టెంబర్లో నీరజ్ చోప్రా.. అగ్రస్థానాన్ని కోల్పోయాడు. పారిస్ ఒలింపిక్స్లో అతడు రజత పతకం సాధించగా, పాకిస్తాన్ త్రోవర్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. పీటర్స్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
చదవండి: ఏడాదికి రూ. 2 వేల కోట్లు, ప్రైవేటు జెట్.. ఇంకా!
కాగా, పారిస్ డైమండ్ లీగ్ మీట్లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో టాప్లో నిలిచిన నీరజ్.. బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్స్ అథ్లెటిక్స్ మీట్లోనూ స్వర్ణ పతకం సాధించి సత్తా చాటాడు. వరుసగా రెండు గోల్డ్ మెడల్స్ గెలవడంతో పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్లో మరోసారి నంబర్వన్గా నిలిచాడు.