
గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్లో రాణించింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(136 బ్యాటింగ్), వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(105 బ్యాటింగ్) ఉన్నారు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే రెండు, అసిత ఫెర్నాండో ఒక వికెట్ పడగొట్టారు.
ఆదుకున్న రహీం, శాంటో..
అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ మొదటి సెషన్లో భారీ షాక్ తగిలింది. శ్రీలంక శ్రీలంక ఫాస్ట్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లా టైగర్స్ వరుసగా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే బంగ్లా ఓపెనర్ అనముల్ హక్ వికెట్ కోల్పోయిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత మోమినుల్ హక్(29), షాద్మాన్ ఇస్లాం (14) స్వల్పవ్యవధిలో పెవిలియన్కు చేరారు.
ఆ సమయంలో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(136 బ్యాటింగ్), వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(105 బ్యాటింగ్) అద్బుత సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 247 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి రోజు ఆటలో శ్రీలంక బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయలేకపోయారు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
తుది జట్లు
శ్రీలంక
పాతుమ్ నిస్సాంక, లహిరు ఉదార, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), మిలన్ ప్రియనాథ్ రత్నాయక్, తరిందు రత్నాయకే, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో
బంగ్లాదేశ్
షాద్మాన్ ఇస్లాం, అనాముల్ హక్, మోమినుల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహిద్ రాణా