సర్ఫరాజ్‌ సునామీ | Mumbai beats Goa in Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్‌ సునామీ

Jan 1 2026 3:17 AM | Updated on Jan 1 2026 11:03 AM

Mumbai beats Goa in Vijay Hazare Trophy

75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో 157

గోవాపై ముంబై ఘన విజయం

బుధవారం 19 శతకాలు నమోదు 

విజయ్‌ హజారే వన్డే టోర్నమెంట్‌

జైపూర్‌: భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (75 బంతుల్లో 157; 9 ఫోర్లు, 14 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 87 పరుగుల తేడాతో గోవాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సర్ఫరాజ్‌ భారీ సెంచరీతో కదం తొక్కగా... ముషీర్‌ ఖాన్‌ (60; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ తమోర్‌ (53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటారు. 

యశస్వి జైస్వాల్‌ (46; 6 ఫోర్లు), కెప్టెన్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షమ్స్‌ ములానీ (22; 2 సిక్స్‌లు), తనుశ్‌ కొటియాన్‌ (23 నాటౌట్‌; 3 ఫోర్లు) కూడా బ్యాట్‌లకు పనిచెప్పారు. ఫలితంగా ముంబై జట్టు భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా ముంబై బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో 35 ఫోర్లు, 25 సిక్స్‌లు బాదారు. గోవా బౌలర్లలో దర్శన్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో తుదికంటా పోరాడిన గోవా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. 

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ (24; 5 ఫోర్లు), కశ్యప్‌ (21; 4 ఫోర్లు), స్నేహల్‌ (27; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (31; 2 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... అభినవ్‌ (70 బంతుల్లో 100; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ బాదగా... కెప్టెన్‌ దీప్‌రాజ్‌ (28 బంతుల్లో 70; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), లలిత్‌ యాదవ్‌ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలు బాదారు. 

ముంబై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3, యశస్వి జైస్వాల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముంబై జట్టు 16 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 229 పరుగుల తేడాతో సిక్కింపై... పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై... మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందాయి. 

నిప్పులు చెరిగిన ముకేశ్, ఆకాశ్, షమీ
భారత పేసర్లు మొహమ్మద్‌ షమీ (2/14), ముకేశ్‌ కుమార్‌ (4/16), ఆకాశ్‌దీప్‌ (4/32) సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా బెంగాల్‌ జట్టు విజయ్‌ హాజారే ట్రోఫీలో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్‌పై విజయం సాధించింది.

 మొదట బ్యాటింగ్‌ చేసిన జమ్మూకశ్మీర్‌ జట్టు 20.4 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (19), శుభమ్‌ ఖజురియా (12) రెండంకెల స్కోరు చేయగా... మిగిలినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతర్జాతీయ స్థాయి బౌలర్ల ముందు జమ్మూ ప్లేయర్లు నిలవలేకపోయారు. 

షమీ వికెట్ల వేట ప్రారంభించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముకేశ్, ఆకాశ్‌ దాన్ని కొనసాగించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగాల్‌ 9.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 64 పరుగులు చేసి గెలిచింది. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన బెంగాల్‌ 12 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరప్రదేశ్‌ 58 పరుగుల తేడాతో అస్సాంపై... విదర్భ 8 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై నెగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement