
2025 సంవత్సరానికి గానూ ఐసీసీ ప్రకటించిన ఏడుగురు హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనికి చోటు లభించింది. టీమిండియాను టీ20 వరల్డ్కప్ (2007), వన్ వరల్డ్కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) విజేతగా నిలిపిన ధోనిని ఐసీసీ సముచిత రీతిలో గౌరవించింది.
ధోని అంతర్జాతీయ క్రికెట్లో 17000కు పైగా పరుగులు (90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు) సాధించి, టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా చలామణి అయ్యాడు. వికెట్ కీపర్గా ధోని 824 మందిని ఔట్ చేయడంలో భాగస్వామిగా ఉన్నాడు.
ఈ ఏడాదికి గానూ ధోనితో పాటు గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా), హాషిమ్ ఆమ్లా (సౌతాఫ్రికా), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), డేనియెల్ వెటోరి (న్యూజిలాండ్), సారా టేలర్ (మహిళా క్రికెటర్, ఇంగ్లండ్), సనా మీర్ (మహిళా క్రికెటర్, పాకిస్తాన్) హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
క్రికెట్కు విశేష సేవలందించిన ఆటగాళ్లకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు కల్పిస్తుంది. ఈ ప్రోగ్రాంను తొలిసారి 2009లో ప్రారంభించారు. హాల్ ఆఫ్ ఫేమ్లో ఇప్పటివరకు 122 మంది క్రికెటర్లుకు చోటు లభించింది.
హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్గా ధోని రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, డయాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కడంపై ధోని ఇలా స్పందించాడు. ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్లు చేసిన సేవలకు గుర్తింపుగా భావించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా. దిగ్గజాల సరసన నా పేరు కూడా చేరడం గొప్ప అనుభూతి. ఇది చిరస్మరణీయమని అన్నాడు.