ఐపీఎల్-2027 సీజన్ ముందు కోల్కతా నైట్రైడర్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానేపై వేటు వేసేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. రహానే సారథ్యంలోని కోలకతా జట్టు వరుసగా 2025, 2026 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరడంలో ఆ జట్టు విఫలమైంది.
ఐపీఎల్-2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టైటిల్ గెలిచినప్పటికీ.. ఆ మరుసటి ఏడాది అతడిని వదిలేసి కేకేఆర్ భారీ తప్పిదం చేసింది. అతడి స్ధానంలో జట్టు బాధ్యతలు చేపట్టిన రహానే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కేవలం కెప్టెన్సీ పరంగా మాత్రమే కాదు వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా విఫలమయ్యాడు. దీంతో వచ్చే సీజన్ మినీ వేలానికి ముందు రహానే విడిచిపెట్టాలని కేకేఆర్ యోచిస్తుందంట.
హార్దిక్పై కన్ను?
అతడి స్ధానంలో ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ను భారీ ట్రేడ్ డీల్ ద్వారా సొంతం చేసుకుని.. ఆపై తమ జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2027 వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కోల్కతా మాత్రం ఇప్పటి నుంచి తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పాటు యాజమాన్యంతో కూడా పాండ్యాకు విబేధాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ను అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్స్గా నిలిపిన హార్దిక్.. ఆ తర్వాత సీజన్లో రన్నరప్గా నిలిచాడు.
కానీ ఐపీఎల్-2024 సీజన్కు ముందు పాండ్యా ముంబై ఇండియన్స్కు ట్రేడ్ అయ్యాడు. అప్పటివరకు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను పాండ్యా ముంబై మేనెజ్మెంట్ అప్పగించింది.
అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గత మూడు సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మిగిలిన రెండు సీజన్లనూ పాయింట్ల పట్టికలో చివరి స్ధానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో హార్దిక్పై ముంబై మేనెజ్మెంట్ తీవ్ర ఆసంతృప్తితో ఉందంట.
చదవండి: ‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’


