ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది! | It will be foolish to write him off: K Srikkanth backs veteran player ODI WC 2027 | Sakshi
Sakshi News home page

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

Jun 15 2026 9:28 PM | Updated on Jun 15 2026 9:28 PM

It will be foolish to write him off: K Srikkanth backs veteran player ODI WC 2027

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ అద్భుత ఆటగాడని.. అతడిని వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే, అందుకోసం ముందుగా జడేజా సెలక్టర్లను ఒప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

ఈ ఏడాది మూడు వన్డేలు ఆడిన స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జడేజా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఓవర్‌కు ఆరు చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు జడ్డూ ఎంపిక కాలేదు. యువ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు.

మరోవైపు.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ 37 ఏళ్ల జడ్డూ భవిష్యత్తు గురించి మాట్లాడాడు.  

హార్దిక్‌ పాండ్యా తిరిగి వస్తే.. 
‘‘జడేజాను ఇప్పుడే లెక్కలోంచి తీసేయొద్దు. అతడు ఇప్పటికీ అద్భుతమైన క్రికెటరే. నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆల్‌రౌండర్‌. హార్దిక్‌ పాండ్యా తిరిగి వస్తే.. నితీశ్‌కు బదులు అతడే జట్టులో ఉంటాడు.

ఇక హార్దిక్‌తో పాటు జట్టులో ఉన్న మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజానే. అతడు ప్రపంచకప్‌ వరకు కొనసాగితే బాగుంటుంది. అయితే, అందుకు జడ్డూ తన ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించాల్సి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ జట్టు నుంచి పూర్తిగా తప్పిస్తామంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిక్కా పేర్కొన్నాడు.

ఫామ్‌లోకి వస్తేనే
కాగా 2027లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో దిగ్గజ బ్యాటింగ్‌ ద్వయం విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ ఆడతారా లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక అరుదుగా జట్టుకు దూరమయ్యే కోహ్లి.. తొడకండరాల గాయంతో అఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. 

మరోవైపు.. ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి వచ్చిన రోహిత్‌ అఫ్గనిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 16 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో చిక్కా మాట్లాడుతూ.. రోహిత్‌ ఫామ్‌లోకి వస్తేనే ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. లేదంటే అతడికి చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

చదవండి: శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌ సూర్యవంశీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement