ఐపీఎల్-2025 విజేత ఆర్సీబీ (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్ షెడ్యూల్కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతే
ఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్ రూపొందించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
అపుడే షెడ్యూల్ విడుదల
‘ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్లు నిర్వహిస్తాం.
బెంగళూరు, రాజస్తాన్ జట్లకు తమ ‘హోమ్ గ్రౌండ్’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్లను షెడ్యూల్ చేస్తాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు.
చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు


