IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌ | IPL 2025, MI VS PBKS Qualifier 2: Suryakumar Yadav Becomes The First Ever MI Player To Smash 700 Plus Runs In An IPL Season | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌

Jun 2 2025 2:58 PM | Updated on Jun 2 2025 3:33 PM

IPL 2025, MI VS PBKS Qualifier 2: Suryakumar Yadav Becomes The First Ever MI Player To Smash 700 Plus Runs In An IPL Season

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఓ సింగిల్‌ సీజన్‌లో 700 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన తొలి ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌గా, ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి నాన్‌ ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

నిన్న (జూన్‌ 1) పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌తో కలుపుకొని స్కై ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 167.92 స్ట్రయిక్‌రేట్‌తో 65.18 సగటున, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 717 పరుగులు చేశాడు. స్కై ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సూర్యకుమార్‌ తర్వాత ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు. సచిన్‌ 2010 సీజన్‌లో 618 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో స్కై సచిన్‌ రికార్డును అధిగమించాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-6 ఆటగాళ్లు..
సాయి సుదర్శన్‌-15 మ్యాచ్‌ల్లో 759  పరుగులు
సూర్యకుమార్‌ యాదవ్‌- 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు
శుభ్‌మన్‌ గిల్‌-15 మ్యాచ్‌ల్లో 650 పరుగులు
మిచెల్‌ మార్ష్‌- 13 మ్యాచ్‌ల్లో 627 పరుగులు
విరాట్‌ కోహ్లి-14 మ్యాచ్‌ల్లో 614 పరుగులు
శ్రేయస్‌ అయ్యర్‌-16 మ్యాచ్‌ల్లో 603 పరుగులు

ఈ సీజన్‌లో స్కై మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. వరుసగా 16 ఇన్నింగ్స్‌ల్లో 25 ప్లస్‌ స్కోర్లు చేశాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఎవరూ వరుసగా ఇన్ని ఇన్నింగ్స్‌ల్లో 25 ప్లస్‌ స్కోర్లు చేయలేదు. స్కై తర్వాత అత్యధికంగా రాబిన్‌ ఉతప్ప వరుసగా 10 ఇన్నింగ్స్‌ల్లో 25 ప్లస్‌ స్కోర్లు చేశాడు (2014లో కేకేఆర్‌ తరఫున). స్కై, ఉతప్ప తర్వాత సాయి సుదర్శన్‌ (9, 2023-24, గుజరాత్‌), విరాట్‌ కోహ్లి (9, 2024-25, ఆర్సీబీ) అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో (వరుసగా) ఈ ఘనత సాధించారు.

ఈ సీజన్‌లో స్కై చేసిన పరుగులు (తాజా ఇన్నింగ్స్‌తో మొదలు)..
44 (26), 33 (20), 57 (39), 73 నాటౌట్‌ (43), 24 (35), 48 నాటౌట్‌ (23), 54 (28), 40 నాటౌట్‌ (19), 68 నాటౌట్‌ (30), 26 (15), 40 (28), 28 (26), 67 (43), 27 నాటౌట్‌ (9), 48 (28), 29 (26)

ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో 700 ప్లస్‌ పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్‌ కోహ్లి-973 (2016)
శుభ్‌మన్‌ గిల్‌-890 (2023)
జోస్‌ బట్లర్‌-863 (2022)
డేవిడ్‌ వార్నర్‌-848 (2016)
సాయి సుదర్శన్‌-759 (2025)
విరాట్‌ కోహ్లి-741 (2024)
కేన్‌ విలియమ్సన్‌-735 (2018)
క్రిస్‌ గేల్‌-733 (2012)
మైక్‌ హస్సీ-733 (2013)
డుప్లెసిస్‌-730 (2023)
సూర్యకుమార్‌ యాదవ్‌-717 (2025)
క్రిస్‌ గేల్‌-708 (2013)

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో సూర్యకుమార్‌ చెలరేగినా ముంబై ఇండియన్స్‌ ప్రయాణం క్వాలిఫయర్‌-2లోనే ముగిసింది. నిన్న (జూన్‌ 1) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో పరాజయంపాలై లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో స్కై విలువైన ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. 

బ్యాటింగ్‌లో సత్తా చాటినా ముంబై బౌలర్లు 203 పరుగుల స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోలేకపోయారు. శ్రేయస్‌ అయ్యర్‌ (87 నాటౌట్‌) పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో పంజాబ్‌ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకుంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement