ఫస్ట్‌ మ్యాచ్‌లోనే మోత.. ఆ రికార్డు ఐదేళ్లు పదిలంగా!

IPL 2021: McCullums Epic 158 Run Knock In First Ever IPL Match - Sakshi

క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌కు కాపీగా ఎన్నో క్రికెట్‌ లీగ్‌లు వచ్చినా దీని స్థానం​ ఇప్పటికీ పదిలంగానే ఉంది. 2007, సెప్టెంబర్‌లో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఐపీఎల్‌కు ముహూర్తం ఖరారు చేయగా, అది 2008లో ఆరంభమైంది.  అప్పట్నుంచి ఇప్పటివరకూ ఈ లీగ్‌ వెనక్కి తిరిగి చూసుకున్న పరిస్థితే రాలేదు. 

స్టార్‌ క్రికెటర్ల సైతం పోటీ పడి మరీ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ఈ లీగ్‌ ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఈ లీగ్‌ 2008 ఏప్రిల్‌ 18వ తేదీన ఆరంభం కాగా,  ఈ లీగ్‌ ప్రస్థానం ఇప్పటికీ చెక్కుచెదరలేదంటే అందుకు సంచలన ప్రదర్శనలే కారణం.  క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ మజాను తీసుకొచ్చిన ఐపీఎల్‌ తొలి సీజన్‌ మొదటి మ్యాచ్‌పై ఒకసారి లుక్కేద్దాం.  

మెకల్లమ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
కోల్‌కతా నైట్‌రైడర్స్‌-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఒక జట్టు అంచనాలు మించి ఆడితే మరొక జట్టు పూర్తిగా తేలిపోయింది. ఇందులో అంచనాలు మించి ఆడిన జట్టు కేకేఆర్‌ కాగా, ఆర్సీబీ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ.. ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను సౌరభ్‌ గంగూలీ, బ్రెండన్‌ మెకల్లమ్‌లు ధాటిగా ప్రారంభించారు. ప్రధానంగా మెకల్లమ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు ఆదిలోనే చుక్కలు కనబడ్డాయి. 5.2 ఓవర్లలో కేకేఆర్‌ 61 పరుగులు చేసిన తర్వాత గంగూలీ(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కానీ మెకల్లమ్‌ బ్యాటింగ్‌ మోత మాత్రం తగ్గలేదు.  స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాడు. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో పరుగుల రుచి ఎలా ఉంటుందో మెకల్లమ్‌ చూపించడాంటే అతిశయోక్తి కాదేమో. 

మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్‌ కూడా రద్దు చేస్తారా!

ఒకవైపు కేకేఆర్‌ స్టార్‌ ఆటగాళ్లు  రికీ పాంటింగ్‌(20), డేవిడ్‌ హస్సీ(12)లు  విఫలమైనా మెకల్లమ్‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  ఈ క్రమంలోనే భారీ సెంచరీ నమోదు చేశాడు. 73 బంతుల్లో 13 సిక్స్‌లు, 10 ఫోర్లతో అజేయంగా 158 పరుగులు చేసి కేకేఆర్‌ 222 భారీ పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీ కావడమే కాకుండా ఈ రికార్డు ఐదేళ్లు పాటు పదిలంగా ఉండటం విశేషం.  ఆటగాళ్ల అత్యధిక పరుగుల రికార్డులో మెకల్లమ్‌ నమోదు చేసిన 158 పరుగులు ఇప్పటికీ రెండో స్థానంలో ఉంది. 2013లో క్రిస్‌  గేల్‌(ఆర్సీబీ) అజేయంగా 175 పరుగులు చేసే వరకూ మెకల్లమ్‌ రికార్డ్‌దే తొలి స్థానం. 

82 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్‌
కేకేఆర్‌ నిర్దేశించిన 223 పరుగుల టార్గెట్‌లో ఆర్సీబీ చతికిలబడింది.  రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలోనే బెంగళూరు 15.1 ఓవర్లలో 82 పరుగులకే చాపచుట్టేసింది. ద్రవిడ్‌(2), వసీం జాఫర్‌(6),  విరాట్‌ కోహ్లి(1),   జాక్వెస్‌ కల్లిస్‌(8), కామెరూన్‌ వైట్‌(6), మార్క్‌ బౌచర్‌(7) ఇలా విఫలం కావడంతో ఆర్సీబీ 140 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.  ఆర్సీబీ ఆటగాళ్లలో ప్రవీణ్‌ కుమార్‌(18)దే డబుల్‌ డిజిట్‌ కావడం గమనార్హం. కేకేఆర్‌ బౌలర్లలో అజిత్‌ ఆగార్కర్‌ మూడు వికెట్లు సాధించగా, అశోక్‌ దిండా, గంగూలీ తలో రెండు వికెట్లు తీశారు.  ఇషాంత్‌ శర్మ,  లక్ష్మీ శుక్లాలకు చెరో వికెట్‌ దక్కింది. దిండా మూడు ఓవర్లు వేసి 9 పరుగులు ఇవ్వగా, ఇషాంత్‌ మూడు ఓవర్లకు 7 పరుగులే ఇచ్చాడు. 

చదవండి: IPL 2021 2nd Phase PBKS Vs RR: పంజాబ్‌ ఆటగాడిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనుమానం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top