విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం | Integrated Cricket Stadium in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

Feb 18 2024 5:01 AM | Updated on Feb 18 2024 5:01 AM

Integrated Cricket Stadium in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిం చనున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపినాథ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియం సామర్థ్యం 27 వేల లోపు ఉందని, క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మరో ప్రపంచ స్థాయి స్టేడియాన్ని నిర్మిస్తున్నామని, దానికి త్వరలోనే శంకుస్థాన చేస్తామని తెలిపారు. విశాఖ స్టేడియంలోని బి గ్రౌండ్‌లో ఇండోర్‌ స్టేడియం నిర్మిస్తామన్నారు. ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఏసీఏ క్రికెట్‌ మైదానాలను అభివృద్ధి చేస్తామని, ప్రతి జోన్‌కు ఒక స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. 

మంగళగిరి స్టేడియాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేస్తూ దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ రూ.10 కోట్లతో ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు కేసులు పరిష్కరించి, ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేస్తా­మన్నారు. విశాఖలో మార్చిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

మూడు జోన్లలోనూ ఏపీఎల్‌ మ్యాచ్‌లు 
ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) రెండు సీజన్‌లు విజయవంతమయ్యాయని, మూడో సీజన్‌ను విశాఖ, విజయవాడ, కడపలో మూడు జోన్లలోనూ నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఎల్‌ ద్వారా ప్రతిభగల యువ క్రికెటర్లు వెలుగులోకి వచి్చ, ఐపీఎల్‌ జట్లలో స్థానం సంపాదించారన్నారు. దేశంలో తొలిసారిగా మహిళా ఏపీఎల్‌ నిర్వహణతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు.

ఉమెన్‌ ఏపీఎల్‌ స్ఫూర్తితోనే బీసీసీఐ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ప్రవేశపెట్టిందని అన్నారు. దేశంలోనే ఏకైక మహిళా క్రికెట్‌ అకాడమీ ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అండర్‌–14 ఇంటర్‌ క్లబ్‌ క్రికెట్‌ లీగ్‌లు ప్రారంభించామని, త్వరలో 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్‌ క్రికెట్‌ లీగ్‌లు నిర్వహిస్తామన్నారు. సుమారు 20 వేల మంది యువ క్రికెటర్లు వారి ప్రతిభను ప్రదర్శించేలా విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు.

ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్‌లో శిక్షణ.. 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. జాతీయ జట్టులో చోటు సంపాదించేలా ప్రతిభ గల క్రీడాకారులకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో వరల్డ్‌ క్లాస్‌ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. క్రికెటర్లతో పాటు కోచ్‌లకు కూడా ఆటలో మెళకువలు, ఫిట్‌నెస్‌ కోసం భారత జట్టు మాజీ కెపె్టన్‌ రవిశాస్త్రి, మాజీ బౌలింగ్‌ కోచ్‌ శేఖర్‌ భరత్‌కు చెందిన ‘కోచింగ్‌ బియాండ్‌’ సంస్థతో ఏసీఏ ఒప్పందం చేసుకుందన్నారు.

అకాడమీలు, కోచింగ్‌ క్యాంప్‌లలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు పౌష్టికాహారం కోసం ఇంటి దగ్గర ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నెలకు రూ.3 వేల చొప్పున 400 మంది క్రికెటర్లకు ఏటా రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏసీఏ సిబ్బందితో పాటు క్రికెటర్లకు కూడా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించామన్నారు. బీసీసీఐ పరిధిలోకి రాని రంజీ మాజీ క్రికెటర్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఏడాదికి రూ.90 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌.వి.చంద్రమౌళి చౌదరి, సీఈవో శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement