విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్! | Vande Bharat Sleeper Express Coming to Vijayawada Visakhapatnam Dasara Launch | Sakshi
Sakshi News home page

విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్!

Jul 23 2026 12:33 PM | Updated on Jul 23 2026 12:41 PM

Vande Bharat Sleeper Express Coming to Vijayawada Visakhapatnam Dasara Launch

భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో వందేభారత్ రైలు సుదూర రాత్రి ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పగటిపూట నడిచే చైర్ కార్ వెర్షన్లతో ఆదరణ పొందిన వందేభారత్‌ సిరీస్‌ రైళ్లను అప్‌డేట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌) పరిధిలో ‘వందేభారత్ స్లీపర్’ పేరుతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎస్‌సీఆర్‌ పరిధిలో దీన్ని ముందుగా విజయవాడ డివిజన్‌లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ మీదుగా ఈ అత్యాధునిక స్లీపర్ సర్వీసును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా బెంగళూరు మార్గంలో ఈ రైలును నడిపే ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ ఈ ఏడాది జనవరిలోనే హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజన్‌లో మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు.

విమాన తరహా ప్రయాణ అనుభూతి

వందేభారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతికత, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో డిజైన్ చేశారు. మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించేలా సీటింగ్/బెర్త్ అమరిక ఉంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల డిజైన్ వేగం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా 160 కి.మీ/గం ఆపరేషనల్ వేగంతో ప్రయాణిస్తుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) సాంకేతికత వల్ల వేగవంతమైన ఆక్సిలరేషన్ సాధ్యమవుతుంది.

ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ బెర్త్‌లు, శబ్ద కాలుష్యం లేకుండా ఉండే సౌండ్ ప్రూఫ్ క్యాబిన్లు, సాఫ్ట్ ఎల్‌ఈడీ లైటింగ్, ప్రతి బెర్త్ వద్ద ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిస్థాయి స్వదేశీ ప్రమాద నిరోధక వ్యవస్థ ‘కవచ్’, నిరంతర సీసీటీవీ నిఘా, ఏఐ ఆధారిత కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ బటన్లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత కోసం బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ వాటర్ ట్యాప్‌లు అమర్చారు.

రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం

సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్యాసింజర్ సేఫ్టీకి ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, ఐటీ, రవాణా అవసరాలకు విజయవాడ కీలక కేంద్రంగా ఉన్నందున ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రావడం ఇక్కడి ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. త్వరలోనే అధికారిక టైమ్‌టేబుల్, ప్రారంభ తేదీ వివరాలను రైల్వే బోర్డు ప్రకటించనుంది.

ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement