స్వర్ణ పతకానికి గెలుపు దూరంలో | Indian womens cricket team in the final | Sakshi
Sakshi News home page

స్వర్ణ పతకానికి గెలుపు దూరంలో

Sep 25 2023 3:24 AM | Updated on Sep 25 2023 6:32 PM

Indian womens cricket team in the final - Sakshi

 హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 17.5 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. కెపె్టన్‌ నిగార్‌ సుల్తానా (12) టాప్‌ స్కోరర్‌ కాగా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఐదుగురు బ్యాటర్లు ‘డకౌట్‌’ కావడం విశేషం.

పేస్‌ బౌలర్‌ పూజ వస్త్రకర్‌ (4/17) తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేసి బంగ్లాను దెబ్బ కొట్టింది. భారత్‌ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్మృతి మంధాన (7) తొందరగానే అవుటైనా... జెమీమా రోడ్రిగ్స్‌ (20 నాటౌట్‌), షఫాలీ వర్మ (17) కలిసి గెలిపించారు. స్వర్ణపతకం కోసం నేడు జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్‌ తలపడుతుంది. రెండో సెమీస్‌లో శ్రీలంక 6 వికెట్లతో పాకిస్తాన్‌పై గెలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement