‘శుభమ్‌’ ఆరంభం | Jammu and Kashmir scored 284 runs for the loss of 2 wickets in 87 overs in the first innings | Sakshi
Sakshi News home page

‘శుభమ్‌’ ఆరంభం

Feb 25 2026 2:43 AM | Updated on Feb 25 2026 2:43 AM

Jammu and Kashmir scored 284 runs for the loss of 2 wickets in 87 overs in the first innings

శుభమ్‌ పుండిర్‌ అజేయ సెంచరీ

జమ్మూకశ్మీర్‌  284/2

మెరిసిన అబ్దుల్‌ సమద్, యావర్‌

కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్‌

హుబ్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న జమ్మూకశ్మీర్‌ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తోంది. ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన కర్ణాటకపై ఏమాత్రం అదురు బెదురు లేకుండా సాధికారికంగా ఆడుతోంది. మంగళవారం ప్రారంభమైన రంజీ ఫైనల్లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న జమ్మూకశ్మీర్‌ జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. 

శుభమ్‌ పుండిర్‌ (221 బంతుల్లో 117 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో విజృంభించగా... యావర్‌ హసన్‌ (150 బంతుల్లో 88; 13 ఫోర్లు), అబ్దుల్‌ సమద్‌ (67 బంతుల్లో 52 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో మెరిశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబరుస్తున్న జమ్మూకశ్మీర్‌ జట్టు... స్టార్‌లతో నిండి ఉన్న కర్ణాటకపై అదే దూకుడు కనబర్చింది. ఓపెనర్‌ కమ్రాన్‌ ఇక్బాల్‌ (6) విఫలం కాగా... మరో ఓపెనర్‌ యావర్‌ హసన్‌తో కలిసి శుభమ్‌ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. 

ఈ క్రమంలో యావర్‌ 77 బంతుల్లో శుభమ్‌ 100 బంతుల్లో హాఫ్‌సెంచరీలు పూర్తి చేసుకున్నారు. శుభమ్‌ ఆరంభం నుంచి ఆచితూచి ఆడితే... యావర్‌ మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదాడు. కర్ణాటక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ ద్వయం 244 బంతుల్లో 139 పరుగులు జోడించింది. ప్రసిధ్‌ బౌన్సర్‌కు గాయపడిన కెపె్టన్‌ పారస్‌ డోగ్రా (9) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగ్గా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్‌ సమద్‌... శుభమ్‌కు చక్కటి సహకారం అందించాడు. 

వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్‌కు 144 బంతుల్లో 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభమ్‌ భారీ సిక్స్‌ సాయంతో 186 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్, సెమీఫైనల్లో బెంగాల్‌పై విజయాలు సాధించిన జమ్మూకశీ్మర్‌ జట్టు... కర్ణాటకపై సైతం చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చింది. 

కర్ణాటక జట్టు తరఫున ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో జమ్మూకశ్మీర్‌ ప్లేయర్లు పరుగుల వరద పారించడం విశేషం. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న జమ్మూకశీ్మర్‌ జట్టు రెండో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకం.  

స్కోరు వివరాలు 
జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: కమ్రాన్‌ ఇక్బాల్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 6; యావర్‌ హసన్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 88; శుభమ్‌ (బ్యాటింగ్‌) 117; పారస్‌ డోగ్రా (రిటైర్డ్‌ హర్ట్‌) 9; అబ్దుల్‌ సమద్‌ (బ్యాటింగ్‌) 52; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (87 ఓవర్లలో 2 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–18, 2–157, 2–179. బౌలింగ్‌: విద్యాధర్‌ పాటిల్‌ 16–0–66–0; విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 18–6–25–0; ప్రసిధ్‌ కృష్ణ 16–5–36–2; శ్రేయస్‌ గోపాల్‌ 17–1–79–0; శిఖర్‌ షెట్టి 20–0–68–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement