ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విజేత భారత్‌.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం | India Won The Physical Disability Champions Trophy 2025 By Beating England In The Final | Sakshi
Sakshi News home page

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విజేత భారత్‌.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

Jan 22 2025 7:25 AM | Updated on Jan 22 2025 8:41 AM

India Won The Physical Disability Champions Trophy 2025 By Beating England In The Final

భారత దివ్యాంగ క్రికెట్‌ టీమ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. శ్రీలంకలో జరిగిన ఫైనల్లో భారత్‌ ఇంగ్లండ్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్‌ 118 పరుగులకే ఆలౌటైంది.

భారత దివ్యాంగ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన విషయాన్ని భారత దివ్యాంగ క్రికెట్‌ కౌన్సిల్‌ (DCCI) ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. కృషి, దృఢ సంకల్పం మరియు నైపుణ్యం యొక్క అసాధారణ ప్రదర్శన అంటూ కామెంట్‌ చేసింది.

మెగా టోర్నీలో విక్రాంత్‌ కేనీ భారత జట్టును ముందుండి నడిపించాడు (కెప్టెన్‌గా). అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్‌కు గర్వకారణమని కేనీ అన్నాడు. ప్లేఆఫ్‌లో ప్రయాణం తమ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపిస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయానికి దోహదపడ్డాడని పేర్కొన్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయం భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి చెందుతుందని అని DCCI విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉటంకించారు.

యోగేంద్ర భదోరియా విధ్వంసం
ఫైనల్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. రాధికా ప్రసాద్‌ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. కెప్టెన్‌ విక్రాంత్‌ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా విజయాన్ని జట్టు ప్రధాన కోచ్ రోహిత్ జలానీ కొనియాడాడు. తన జట్టు అసాధారణ ప్రదర్శన మరియు సన్నద్ధతను ప్రశంసించాడు. టోర్నీ ఆధ్యాంతం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని ఆకాశానికెత్తాడు. విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సవాలును తమ ఆటగాళ్లు అధిగమించారని అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement