'భారత్‌దే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క ప‌రుగు తేడాతో'.. క్లార్క్‌ జోస్యం | India will beat Australia by 1 run to win Champions Trophy Michael Clarke | Sakshi
Sakshi News home page

'భారత్‌దే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క ప‌రుగు తేడాతో'.. క్లార్క్‌ జోస్యం

Mar 1 2025 12:45 PM | Updated on Mar 1 2025 3:15 PM

India will beat Australia by 1 run to win Champions Trophy Michael Clarke

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భార‌త జ‌ట్టు.. త‌మ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

అనంత‌రం రోహిత్ సేన సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా టీమిండియా నిలుస్తుంద‌ని క్లార్క్ జోస్యం చెప్పాడు.

"ఈ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నాను. ఆసీస్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వాల‌ని నేను మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ టీమిండియాకే విజ‌య అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భార‌త్ సొంతం చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. 

భార‌త్ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా ఉంది. వారిని ఓడించ‌డం అంత ఈజీ కాదు. భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య తుది పోరు హోర‌హోరీగా జ‌రుగుతుంది. కానీ టీమిండియా ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధిస్తుంది" అని రేవ్ స్పోర్ట్స్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిలుస్తాడ‌ని క్లార్క్ అంచ‌నా వేశాడు.

"రోహిత్ శ‌ర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అత‌డు క‌ట‌క్‌లో భారీ సెంచ‌రీ సాధించాడు. అద్భుత‌మైన షాట్ల‌తో అంద‌రిని అల‌రించాడు. అత‌డు ఈ మెగా ఈవెంట్‌లో కూడా మంచి ట‌చ్‌లో క‌న్పిస్తున్నాడు. రోహిత్ భార‌త్‌కు కీల‌కంగా మార‌నున్నాడు.

 అత‌డు త‌న దూకుడును కొన‌సాగించాలి.  ప‌వ‌ర్ ప్లేలో ప‌రుగులు రాబ‌ట్టాల‌న్న అత‌డి ఉద్దేశ్యంలో ఎలాంటి త‌ప్పు లేదు. రోహిత్ అద్భుత‌మైన ఆట‌గాడు. రోహిత్ శ‌ర్మ టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై 40 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. పాకిస్తాన్ 20 ప‌రుగుల‌తో క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!?

 

Advertisement
 
Advertisement
Advertisement