పాకిస్తాన్‌ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు: పీసీబీ చీఫ్‌ | ICC Women WC 2025: PCB Chief Naqvi Confirms Pakistan Will not Travel to India | Sakshi
Sakshi News home page

ICC ODI WC: పాకిస్తాన్‌ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు: పీసీబీ చీఫ్‌

Apr 20 2025 9:55 AM | Updated on Apr 20 2025 10:55 AM

ICC Women WC 2025: PCB Chief Naqvi Confirms Pakistan Will not Travel to India

భారత్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్‌ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్‌ జట్టు భారత్‌లో పర్యటించబోదని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహసిన్‌ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించేందుకు నిరాకరించింది. 

ఈ క్రమంలో రోహిత్‌ సేన ఆడే మ్యాచ్‌లను ‘హైబ్రీడ్‌ మోడల్‌’లో దుబాయ్‌లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆడనున్న మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు అంగీకారం తెలిపాయి. 

‘భారత జట్టు పాకిస్తాన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్‌ విషయంలోనే అదే జరుగుతుంది. 

ఆతిథ్య హోదాలో భారత్‌ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ –అక్టోబర్‌లలో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనుంది.

వెస్టిండీస్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌ క్వాలిఫై
భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్‌ అర్హత సాధించింది. పాకిస్తాన్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కించుకుంది. 

లాహోర్‌లో శనివారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్‌ (44 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్‌ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. 

అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్‌ (52 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) సత్తాచాటారు.

ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్‌ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్‌ జట్టు 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్‌ రెండో ‘ప్లేస్‌’దక్కించుకుంది. వెస్టిండీస్‌ కూడా 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్‌రేట్‌లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్‌ ముందంజ వేసింది.  

మాథ్యూస్‌ మెరుపులు వృథా... 
వెస్టిండీస్‌ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్‌రేట్‌తో వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. 

ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్‌లాండ్‌ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్‌ చాంతమ్‌ (66; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. విండీస్‌ బౌలర్లలో అఫీ ఫ్లెచర్‌ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.

అనంతరం ఛేదనలో విండీస్‌ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెపె్టన్‌ హేలీ మాథ్యూస్‌ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్‌ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టింది.

మాథ్యూస్‌ మెరుపులతో కరీబియన్‌ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్‌ కావడం విండీస్‌ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ 0.639 రన్‌రేట్‌తో నిలవగా... వెస్టిండీస్‌ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్‌ వరల్డ్‌కప్‌ పోటీ నుంచి తప్పుకొంది.  

చదవండి: కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement